భద్రాచలం, డిసెంబర్ 17: భద్రాద్రి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల్లో వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రోహిత్రాజ్ వివరాలు వెల్లడించారు. భూపాలపల్లికి చెందిన దురిశెట్టి నిరంజన్ కొన్నేళ్లుగా భద్రాచలంతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరిస్తున్నాడు.
చోరీ కేసులో అరస్టై కొద్దిరోజుల క్రితం బయటకు వచ్చిన నిరంజన్ మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. ఏఎస్పీ ఆదేశాల మేరకు భద్రాచలం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం నిందితుడు భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద తచ్చాడుతుండడాన్ని పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అతడిని తమదైన శైలిలో విచారించగా నేరాలను అంగీకరించాడు. నిందితుడి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, మూడు కిలోల వెండి సామగ్రితో పాటు రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీఐ నాగరాజ్రెడ్డి, ఎస్సైలు మధు ప్రసాద్, శ్రీకాంత్ పాల్గొన్నారు