పాల్వంచ, జనవరి 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జాతీయ రహదారిపై కొత్తగూడెం- పాల్వంచ మధ్య ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. పాల్వంచ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చుంచుపల్లి మండలం రామాంజనేయకాలనీకి చెందిన ఆటోడ్రైవర్ కొల్లూరు వీరన్న(44) భార్య శ్రీలత(37)తో కలిసి ఆదివారం సాయంత్రం పాల్వంచలోని గాంధీనగర్లో ఉంటున్న తన అన్నయ్య వద్దకు వెళ్లాడు. తిరిగి రాత్రి 12గంటల సమయంలో దంపతులిద్దరూ వారి సొంత ఆటోలో ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం మైనింగ్ స్కూల్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్లో డీజిల్ పోయించుకునేందుకు ఆటోను యూటర్న్ చేస్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టడంతో వీరన్న అక్కడికక్కడే మృతిచెందాడు.
భారీ శబ్ధ్దానికి పెట్రోల్ బంక్ వారు, దాబా హోటళ్ల వారు గమనించి ఘటనా స్థలానికి వచ్చి శ్రీలతను కొత్తగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించి వైద్యం అందిస్తుండగా శ్రీలత మృతిచెందింది. భార్యాభర్తల మృతదేహాలను పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి దద్దరిల్లింది. వీరికి బీటెక్ చదువుతున్న కుమారుడు ఉదయ్కుమార్, వివాహమైన కుమార్తె ఉంది. పాల్వంచ పట్టణ ఎస్సై ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్పాషా ప్రభుత్వాసుపత్రిలో దంపతుల మృతదేహాలను సందర్శించి నివాళి అర్పించారు. ఆయనతోపాటు సీపీఐ నాయకులు ముత్యాల విశ్వనాథం, వీసంశెట్టి పూర్ణచందర్రావు, ఉప్పుశెట్టి రాహుల్ ఉన్నారు.
చండ్రుగొండ, జనవరి 2: గూడ్స్ రైలు ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు, స్థానికుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ర్టానికి చెందిన రవికిషన్ సహాని (20) మరికొంత మందితో కలిసి జామాయిల్ చెట్లను నరకడం కోసం కూలీ పనుల కోసం ఇటీవల తుంగారం పంచాయతీ జర్పులాతండా వచ్చారు. సోమవారం తెల్లవారుజామును బహిర్భూమి కోసం కొత్తగూడెం- సత్తుపల్లి రైలు పట్టాలను దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో రవికిషన్ సహాని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఉమేశ్ ఫిర్యాదు మేరకు కొత్తగూడెం రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇల్లెందు రూరల్, జనవరి 2: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకున్నది. స్థ్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తరాపు కట్ట గ్రామానికి చెందిన మెస్సు భిక్షపతి(27) ఇల్లెందు పట్టణంలో మొబైల్ రిపేర్ షాప్లో పనిచేస్తున్నాడు. కాగా నూతన సంవత్సరం కావడంతో షాప్లో గిరాకీ ఎక్కువగా ఉండండంతో అదివారం అర్ధరాత్రి షాప్ నుంచి తిరిగి వస్తుండగా ఆశోక్నగర్ వద్ద మూలమలుపులో బైక్ అదుపు తప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కొత్త సంవత్సరం రోజే చనిపోవడంతో కుటుంబంలో విషాద చాయాలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.