భద్రాద్రి కొత్తగూడెం, జూలై 21 (నమస్తే తెలంగాణ): వరదలు తగ్గుతాయని అంచనా వేసుకోకూడదని, రానున్న రెండు నెలలూ వరదల కాలమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందువల్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి వరదల వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లోని బాధితులను తక్షణమే గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పొంగి పొర్లుతున్న వాగుల మీదుగా ప్రజలు రాకపోకలు చేయకుండా నియంత్రించాలని, లోతట్టు రహదారుల వద్ద బారికేడ్లతో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రజలెవరూ సంచరించకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
మండల కేంద్రాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు అక్కడే ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. కరకట్ట కింది ప్రదేశంలోకి వర్షపు నీరు చేరుతోందని, వాటిని మోటార్ల ద్వారా తోడించి ముంపు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో వచ్చిన వరదలు ఎక్కువ నష్టాన్ని కలిగించాయని, ఈసారి అలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీనియర్ అధికారులను ఇప్పుడు మళ్లీ నియమించామని, వారి సూచనలతో జిల్లా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు మూడు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వరద తగ్గేంతవరకు తాను భద్రాచలంలోనే ఉంటానని, అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సిబ్బందిని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అనంతరం కరకట్ట ప్రదేశాన్ని సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ గతంలో వరదలకు మణుగూరు ప్రాంతంలో ప్రజలు పాము కాట్లు, తేలు కాట్లకు గురయ్యారని అన్నారు. ఈసారి అలాంటివి జరుగకుండా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తుగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పాము, తేలుకాటు మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం సీనియర్ ఐఏఎస్లు అనుదీప్, పొట్రు గౌతమ్, కృష్ణ ఆదిత్యలు గత వరదల సమయంలో తమ అనుభవాలను అధికారులకు తెలియచేశారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఎస్పీ వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, ఆర్డీవో రత్నకల్యాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
యంత్రాంగం సిద్ధంగా ఉంది..
ఎగువ నుంచి ఎంత వరదొచ్చినా ఎదుర్కొనడానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. భద్రాచలంలో వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను శుక్రవారం సాయంత్రం సందర్శించిన ఆయన.. కరకట్ట వద్ద గోదావరి వరద ఉధృతిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది వరద ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ మళ్లీ వరద వచ్చే అవకాశం ఉండొచ్చన్నారు. నిరుడు వరద 70 అడుగులకు మించి ప్రవాహం ఉండడం వల్ల పోలవరం ప్రాజెక్టు అడ్డంకిగా మారిందన్నారు. ప్రస్తుతం భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. ఇంకా 71 కేంద్రాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వరద నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
వరదలపై మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్..
భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి అజయ్కుమార్కు ఫోన్ చేసి ఆరా తీశారు. మంత్రి పువ్వాడ సమీక్ష సమావేశంలో ఉండగానే కాల్చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద తగ్గేంతవరకు భద్రాచలంలోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి ఎవరికీ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.