ఖమ్మం రూరల్, నవంబర్ 27: అభివృద్ధి చేసిన ప్రభుత్వానికే పట్టం కట్టాలని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చునని అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం పర్యటించిన ఆయన.. ఎంవీపాలెం, వెంకటగిరి, కాచిరాజుగూడెం తదితర గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనకు మరోసారి అత్యధిక మెజార్టీ అందించాలని, తద్వారా కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. పాలేరు నియోజకవర్గంలో పరాయి వాళ్లకు చోటు ఇవ్వవద్దని కోరారు.
గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ ఓ ఒక్క నాయకుడూ ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రజల బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. స్థానికుడినైన తాను అక్కడి ప్రజలకు తోడుగా నిలిచానని, వారి కష్టసుఖాల్లో అండగా నిలబడ్డానని, తన శక్తి మేరకు వారికి సహాయ సహకారాలు అందించానని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని అన్నారు. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుల మాటల గారడికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తాళ్లూరి జీవన్కుమార్, బెల్లం వేణుగోపాల్, యండపల్లి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.