సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 22: సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులకు వడ్డీ ఆశ జూపి దొడ్డిదారిన ఏకంగా రూ.1.50 కోట్లు స్వాహా చేశాడు. ఆ సొమ్ములో బ్యాంక్ అధికారులు రూ.50 లక్షల వరకు రికవరీ చేయగలిగినప్పటికీ మిగతా రూ.కోటి కోసం ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ప్రశాంత్ అనే ఉద్యోగి బ్యాంకు పరిధిలోఎక్కువ మొత్తంలో నగదు జమ చేసిన ఖాతాదారులను చాకచక్యంగా గుర్తించాడు. వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. గత ఆర్థిక సంవత్సరం చివరలో తమకు పైనుంచి టార్గెట్ ఇచ్చారని, బా్ంయక్ ఖాతాల్లోని సొమ్మును డిపాజిట్ రూపంలో చెల్లిస్తే వడ్డీతో కలిపి తిరిగి వెంటనే ఖాతాల్లో జమ చేస్తామని ఖాతాదారులను నమ్మించాడు. ఖాతాదారులు అతడి మాటలను నమ్మి కొన్ని చెక్కులు ఇచ్చారు. వాటిని ప్రశాంత్ మరో ఉద్యోగి భార్య పేరుపై ఖాతా తెరిపించి దానిలో చెక్కులు వేయించాడు. ఇలా ఆరు నెలల నుంచి కొద్దికొద్దీగా నగదు డ్రా చేయడం ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత ప్రశాంత్ చెప్పినవేవీ జరగకపోవడాన్ని గుర్తించారు. తాము డిపాజిట్ చేసిన సొమ్ము డ్రా కావడాన్ని నిర్ధారించుకున్నారు.
ఖాతాదారులు బ్యాంక్కు వచ్చి నిలదీశారు. తర్వాత ప్రశాంత్ సెలవు పెట్టి వెళ్లిపోయాడు. ఇలా ప్రశాంత్ సుమారు రూ.1.50 కోట్ల వరకు సొమ్మును మళ్లించాడు. బ్యాంక్ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ప్రశాంత్ నుంచి రూ.50 లక్షల వరకు రికవరీ చేసి కొందరు ఖాతాదారులకు సొమ్ము సెటిల్ చేశారు. మిగిలిన ఖాతాదారులను బ్యాంక్కు రప్పించి విషయం బయటకు వస్తే బ్యాంక్ పేరు ప్రఖ్యాతలు దెబ్బతింటాయని, ఈ విషయాన్ని బయటకు వెల్లడించవద్దని, ఎలాగోలా సొమ్ము సెటిల్ చేస్తామని హామీ పత్రాలను ఇచ్చి బుజ్జగించారు. విషయం ఈ నోటా ఆ నోటా పడి ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇంత తంతు జరుగుతున్నప్పటికీ సంబంధిత ఉద్యోగిపై బ్యాంకు ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. బ్రాంచ్ మేనేజర్ పోస్టును కొంత కాలం నుంచి భర్తీ చేయకపోవడంతోనే అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ అదనుగా భావించి మోసానికి పాల్పడినట్లు సమాచారం. డబ్బుతో ప్రశాంత్ క్రికెట్ బెట్టింగ్స్కు పాల్పడినట్లు, దుర్వ్యసనాలతో జల్సా చేసినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ‘నమస్తే’ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బ్రాంచి మేనేజర్ నాగరాజును వివరణ కోరగా.. సొమ్ము మళ్లింపుపై తమ లీగల్ బృందం సమగ్ర విచారణ చేపడుతున్నదని, ఇప్పుడే ఎలాంటి విషయాలు వెల్లడించలేమని సమాధానమిచ్చారు.