కూసుమంచి, మార్చి 11 : పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం తగ్గడంతో అనధికారిక ఆయకట్టు రైతులు జేసీబీతో గండికొట్టి నీటిని తరలించిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో సంబంధిత రైతులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుతం 9.50 అడుగులు మాత్రమే ఉంది. ప్రతి నీటిబొట్టును వృథా చేయకుండా నెల రోజులుగా ఐదు జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్న ఇరిగేషన్ అధికారులకు రైతులు షాక్ ఇచ్చారు. జేసీబీతో చెరువుకు గండికొట్టి సుమారు 50 మీటర్ల దూరం కాలువ తీశారు. సోమవారం విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు గండికొట్టిన రైతుల వివరాలను సేకరించి.. నీటిని వాడుకోకుండా చర్యలు చేపట్టారు.
పాలేరు రిజర్వాయర్ పరిధిలో ఎలాంటి అక్రమ నీటి వాడకాలకు పాల్పడినా పోలీసుల సహాయంతో వారిపై చర్యలు తీసుకుంటాం. తాగునీటికే ఇబ్బందులు పడుతున్న తరుణంలో నీటిని అక్రమంగా ఎవరు వినియోగించినా చర్యలు చేపడతాం. ఇరిగేషన్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే మాకు తెలియజేయాలి. కాలువలపై సీసీ కెమెరాలు ఉన్న నేపథ్యంలో ఎవరు అక్రమాలకు పాల్పడినా వెంటనే దొరికిపోతారు. – మంగలపుడి వెంకటేశ్వరరావు, ఈఈ
పాలేరు రిజర్వాయర్ నుంచి అక్రమంగా నీటిని వాడుకున్న ఐదుగురు రైతులపై చర్య తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ సురేశ్కుమార్, ఎస్సై కిరణ్, డీఈలు రత్నకుమారి, మన్మథరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. జేసీబీని సీజ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు.