కారేపల్లి,మార్చి 18 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గుట్ట కిందగుంపు శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్ లారీలను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా మైనింగ్ ఏడీ సాయినాథ్ తెలిపారు. గత కొన్ని రోజులుగా గుట్టకిందగుంపు గ్రామ శివారులోని అడవి గుట్ట ప్రాంతంలో జేసీబీలతో తవ్వకాలు చేస్తూ అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో రైడ్ చేసినట్లు చెప్పారు.
మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను అదుపులోకి తీసుకొని కారేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. టిప్పర్లు మట్టి లోడుతో కారేపల్లి-ఇల్లెందు రోడ్డు మార్గం గుండా వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వాహన యజమానులపై మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్ తో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ బైరు గోపి కేసు నమోదు చేసినట్లు ఏడీ పేర్కొన్నారు.