జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : బొగ్గు బ్లాకుల కేటాయింపులో గుజరాత్కు ఒక నీతి.., తెలంగాణకు ఒక నీతా..! అని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో ఎండగట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సింగరేణికి కేం ద్రం చేస్తున్న అన్యాయంపై, రాష్ట్ర ప్రభుత్వ వి ధానాన్ని ప్రస్తావించాలని భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారని మంత్రి చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాలుగు బొగ్గు బ్లాకులను నామినేషన్ ఇవ్వాలని కోరితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అదే తెలంగాణలోని 4 బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని స్వయంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. పైగా వేలం పెడతాం, వేలంలోనే తీసుకోవాలని కేంద్రం మాట్లాడిందని మండిపడ్డా రు. దయచేసి సమదృష్టితో చూడాలని, ఇప్పటికైనా తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని కోరారు. ‘కేంద్ర ప్రభు త్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇలాగే చేసిందని, మొదట గనులు ఇవ్వరు, నష్టాల బాట పట్టిస్తారు, తర్వాత నష్టాల్లో ఉందని అమ్మేస్తారు. అది ఎవరో కాదు వారి దోస్తులే కొంటారు. కార్పొరేట్ రుణాలకు దరఖాస్తు చేసుకుంటారు. ఆ తర్వాత ఆ రుణాలు కూడా మాఫీ చేస్తారు..’ అని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అసెంబ్లీ సాక్షిగా 60 వేల మంది కార్మికుల పక్షాన కోరుతున్నా.. దయచేసి పరిగణలోకి తీసుకోండి, బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి’ అని అన్నారు.