‘కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది. బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రజలే హైకమాండ్. కానీ.. కాంగ్రెస్ నేతల హైకమాండ్ ఢిల్లీ, బెంగు ళూరులో ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలకు ఇస్తూ.. బీఆర్ఎస్పై అసంబద్ధమైన గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారి మాటలు నమ్మొద్దు. నిరంతర అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు బీఆర్ఎస్నే ఆశీర్వదించాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకున్నారు. వారికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు బీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీతో ఖమ్మం వైద్య కళాశాలకు చేరుకున్నారు. అక్కడి పలు విభాగాల భవనాలను ప్రారంభించారు. తర్వాత నగరంలోని మమత మెడికల్ కళాశాలకు చేరుకుని ఆస్పత్రి ‘సిల్వర్ జూబ్లీ’ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్ తండ్రి, సీపీఐ సీనియర్ నేత, ఆసుపత్రి ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలో పాల్గొన్నారు. తర్వాత మద్దులపల్లిలో నర్సింగ్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు.
-ఖమ్మం, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రజలే హైకమాండ్. కానీ.. కాంగ్రెస్ నేతల హైకమాండ్ ఢిల్లీ, బెంగళూరులో ఉంటుంది. కాంగ్రెస్ హయాంలో అనేక ప్రాజెక్ట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచరణ సాధ్యం కానీ హామీలను ప్రజలకు ఇస్తున్నారు. పైగా బీఆర్ఎస్పై అసంబద్ధమైన గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వారిది గోబెల్స్ విధానం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోబుల్స్’, ‘గోబెల్స్’ మధ్యే పోరాటం..’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకున్నారు. వారికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు బీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీతో ఖమ్మం వైద్య కళాశాలకు చేరుకున్నారు.
అక్కడి పలు విభాగాల భవనాలను ప్రారంభించారు. తర్వాత నగరంలోని మమత మెడికల్ కళాశాలకు చేరుకుని ఆస్పత్రి ‘సిల్వర్ జూబ్లీ’ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్ తండ్రి, సీపీఐ సీనియర్ నేత, ఆసుపత్రి ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలో పాల్గొన్నారు. తర్వాత నగరంలోని మంత్రి పువ్వాడ అజయ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలను నమ్ముకుంటే, బీఆర్ఎస్ మాత్రం తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నమ్ముకున్నదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వాన్నే ప్రజలు విశ్వసిస్తారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలబడ్డారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసింది చెప్పడం నోబు ల్ విధానమని, అందుకే మా పార్టీ ‘నోబుల్’. మా నేతలు, ప్రజాప్రతినిధులు ‘నోబుల్స్’ అని ఆయన పేర్కొన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు పట్టెడన్నం పెట్టలేని కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే గోరుముద్దలు తినిపిస్తామని కల్లబొల్లి మాటలు చెప్తుండడం శోచనీయమన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తామంటే ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలది కేవలం మేకపోతు గాంభీర్యమని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కలహాలు సృష్టిస్తుందన్నారు. కుర్చీల కోసం ఆ పార్టీ నేతలు కొట్లాడుకుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీకి పేదలు, విద్యార్థులు, రైతులంటే పట్టదన్నారు.
కాంగ్రెస్ పార్టీది తన్నుల సంస్కృతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వానిది టన్నుల సంస్కృతి అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎరువులు, విత్తనాలు, సాగునీటి కోసం తన్నులాట జరిగేదన్నారు. ఆ ప్రభుత్వంలో వ్యవసాయం నీరుగారిందన్నారు. కానీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులు టన్నులకొద్దీ ధాన్యాన్ని పండించి దేశానికే అన్నం పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు బీఆర్ఎస్నే ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిందన్నారు. అలా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమ, కోయల్సాగర్ ప్రాజెక్ట్ల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి, దానిని విజయవంతంగా నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 16న ప్రారంభించనున్నారన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంటే ప్రతిపక్షాలు మాత్రం శాపనార్థాలు పెడుతున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రజల కరువు తీర్చడానికి ప్రాజెక్టులు నిర్మిస్తే ప్రతిపక్షాలు స్వాగతిస్తాయని, కానీ తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాలు శకుని శాపనార్థాలు పెడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేశారని గుర్తు చేశారు.
ట్రిబ్యునల్స్కు వెళ్లి ప్రాజెక్ట్లను ఆపే యత్నం చేశారన్నారు. భూసేకరణ జరగకుండా ప్రజలను రెచ్చగొట్టారన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ మాత్రం పట్టుదలతో పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తి చేశారన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందంటే పాలమూరు ప్రజలు పండుగ వస్తుందని భావిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రాజెక్ట్ దండగ అని ప్రచారం చేస్తున్నారన్నారు. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీనే దండగమారి పార్టీ అని తేల్చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను పనిమంతమైన పార్టీగా గుర్తిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం ప్రజలకు పగోళ్లలా మారారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి, పట్టుదలతోనే పాలమూరు జిల్లా సస్యశ్యామలమవుతున్నదన్నారు. ప్రజలకు పాలనలో పనిమంతులు ఉండాలా? పగోళ్లు ఉండాలా? అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.
రాష్ట్రంలో వైద్య విప్లవం నడుస్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రాష్ర్టాన్ని ఏ రంగంలో తీసుకున్నా దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. స్వరాష్ట్రం రాకముందు విద్యార్థులు వైద్యవిద్య చదివేందుకు రష్యా, ఉక్రెయిన్, చైనా, పిలిప్పెన్స్కు వెళ్లేవారన్నారు. చదువుకు రూ.లక్షలకు లక్షలు వెచ్చించాల్సి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆటో నడిపే వారి పిల్లలు, హమాలీ కూలీ పిల్లలు కూడా మెడికల్ సీట్లు సాధిస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలల్లో ప్రస్తుతం అడ్మిషన్ ఫీజు ఏడాదికి రూ.10 వేలు మాత్రమేనన్నారు. రాష్ట్రం ఏడాదికి 10 వేల మంది వైద్య విద్యార్థులను తయారు చేస్తున్నదన్నారు ధాన్యం ఉత్పతిలోనూ, డాక్టర్ల తయారీలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ అన్నారు. ఒకప్పుడు తెలంగాణ కరువు పీడిత ప్రాంత ంగా.. కల్లోలిత ప్రాంతంగా ఉండేదన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కట్టడం, చెక్డ్యాంలు నిర్మించడం, చెరువులను బాగు చేయడంతో రాష్ట్రం హర్యానా, పం జాబ్ను తలదన్నేలా ధాన్యం ఉత్పత్తి చేస్తున్నదన్నారు. ఐటీ, వ్యవసాయం, వైద్యం, విద్య.. ఇలా ఏ రంగమైనా దేశంలో తెలంగాణదే పైచేయి అని స్పష్టం చేశారు. తొమ్మిందేండ్ల క్రితం తెలంగాణలోని కాలువల్లో సర్కారు తుమ్మలు మొలిచేవని, అలాంటిది ఇప్పుడు అవే కాలువల్లో నీరు పారుతున్నదన్నారు. రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ది బెస్ట్ చేస్తే, దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం ప్రయోజనాలు చేకూర్చిందో ఆ పార్టీ నేతలు తెలపాలని మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు, విద్యుత్, వ్యవసాయ రంగాలను పట్టించేకోలేదన్నారు. మెడికల్ కళాశాలల ఏర్పాటును ఎందుకు గాలికి వదిలేసిందన్నారు. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ప్రభుత్వ విలీన బిల్లును ఆమోదించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీని అప్పుల పాలు చేసి దెబ్బతీశాయన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే కుట్రలు చేశాయన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీని కాపాడారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛను నిజం చేశారన్నారు. ఇక నుంచి ఆర్టీసీ కార్మికులూ ప్రభుత్వ ఉద్యోగులేనన్నారు. అనంతరం మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మద్దులపల్లిలో ఖమ్మం మెడికల్ కళాశాలకు అనుసంధానంగా నిర్మించనున్న నర్సింగ్ కళాశాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, పాలేరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధుసూదన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్కుమార్ పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందని రోజుల్లో తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు మమత వైద్యశాలను స్థాపించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సమైక్య పాలనలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో 100 పడకలు ఉండేవని, తెలంగాణ వచ్చాక ఆస్పత్రిని 500 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చేశామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చొరవతో ఖమ్మం, కొత్తగూడెంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్సే జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.