ఖమ్మం మార్చి 28 : తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల నిర్వహించిన ఐదో జాతీయ కుటుంబ సర్వేలో దేశంలోని 50శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, ఐదేండ్లలోపు చిన్నారుల్లో 31.2 శాతం మంది సాధారణం కంటే తక్కువ బరువు, 35శాతం మంది వయస్సుకు తగిన ఎదుగుదల లేదని వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులు, మహిళలతోపాటు ప్రజలకు బలవర్ధక ఆహారం అందించాలని నిర్ణయించింది. పోషక విలువలతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ రేషన్బియ్యంతో కలిపి అందించాలని నిర్ణయించింది. అందుకు తగినట్లుగా సివిల్ సప్లయ్, రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
4,12,743 మంది కార్డుదారులకు పంపిణీ
జిల్లాలోని 8 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా 711 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 4,12,743 ఆహార భద్రత కార్డులుండగా.. 11,41,601 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికి 5 కిలోల చొప్పున ఉచితంగా 50 వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. గతంలో రూపాయికి కిలో బియ్యం అందించిన సర్కార్ కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నది. ఖమ్మం జిల్లాలో 1,004 ప్రాథమిక పాఠశాలలు, 211 ఉన్నత పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కేంద్రీయ విద్యాలయాలు, మోడల్, నవోదయ స్కూల్స్, కస్తూర్బా గాంధీ (కేజీబీవీ) పాఠశాలలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది. వీటితో విద్యార్థులు, చిన్నారులకు మధ్యాహ్న భోజనం అందించడంతో రక్తహీనత, పొషకాహార లోపాన్ని నివారిస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవడం వల్ల ఎదుగుదలతోపాటు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తున్నది. జ్ఞాపకశక్తి, వ్యాధినిరోదక శక్తిని పెంచుతున్నది.
ఫోర్టిఫైడ్ రైస్ అంటే..?
ఆహార పదార్థల్లో లోపించిన పోషకాల లోపాన్ని గుర్తించి కృత్రిమ పద్ధతి ద్వార పోషకాలను కలిపే ప్రక్రియను ఫోర్టికేషన్ అంటారు. పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే (మర పట్టె) సమయంలో ఎక్కువగా పాలిష్ చేయడంతో నూక, పొట్టు రూపంలో అందులో ఉన్న పోషక విలువలు పోతాయి. ఈ ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి పోషకాలు అందవు. తద్వారా అనారోగ్యానికి గురి కావడం జరుగుతున్నది. గర్భిణుల్లో రక్తహీనత, చిన్నారుల్లో బరువు, ఎదుగుదల వంటివి లేకపోవడం చోటుచేసుకుంటున్నది. బియ్యంలో పోషకాల నష్టాన్ని భర్తీ చేసేందుకు బియ్యం పిండిలో ఐరన్, పోలిక్యాసిడ్, బి-12 వంటి పోషకాల మిశ్రమంతో బియ్యంతో పోలి ఉన్న కృత్రిమ బియ్యాన్ని (కేర్నల్స్) తయారు చేస్తారు. వీటిని 99 కేజీల బియ్యంలో ఒక కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కలిపి రేషన్షాపుల ద్వారా ప్రజలకు అందించనున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ను మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చే సమయంలోనే వీటిని మిక్స్ చేస్తారు. నాణ్యమైన ఫోర్టిఫైడ్ రైస్ బ్లాక్ మార్కెట్కు తరలకుండా చర్యలు తీసుకుంటున్నామని సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొన్నారు.
అనేక ప్రయోజనాలు…
ఫోర్టిఫైడ్ బియ్యంలో కలిపే పోషకాలతో ఎనిమియా(రక్త హీనత) నుంచి రక్షణ పొందవచ్చు. శరీరంలో అలసట తగ్గిస్తుంది. చురుకుదనం, చలాకీతనం పెంచుతుంది. నెలలు నిండకుండా ప్రసవం అవడం, బరువు తక్కువగా పుట్టడం వంటి ప్రసవ సంబంధిత సమస్యలు తలెత్తవు. ఫొర్టిఫైడ్ బియ్యంలో పోలిక్యాసిడ్, విటమిన్ బి-12 వంటి సూక్ష్మ పోషకాలను చేర్చుతారు. వీటిని మామూలు బియ్యం లాగానే కడిగి వండుకోవచ్చు. నిల్వ చేయడానికి ప్రత్యేక విధానాలు పాటించాల్సిన అవసరం లేదు. ఫోర్టిఫైడ్ బియ్యంతో వండుకున్న అన్నం రంగు, రుచి, వాసన పూర్తిగా మామూలు బియ్యంతో చేసిన అన్నం లాగానే ఉంటుంది. ఈ అన్నం త్వరగా పాడైపోయే అవకాశం లేదు. అన్నిరకాల వయస్సు వారు తినొచ్చు.
వచ్చేనెల నుంచి పంపిణీ చేస్తాం
ప్రజలకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు ఫోర్టిఫైడ్ రైస్తో కలిపి ఉన్న రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా పంపిణీకి కసరత్తు చేస్తున్నాం. ఫోర్టిఫైడ్ రైస్తో గర్భిణులు రక్తహీనతను అధిగమించవచ్చు. పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది. జ్ఞాపకశక్తికి దోహదం చేస్తుందని వైద్యలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహల్లో ఫోర్టిఫైడ్ రైస్ను సరఫరా చేస్తున్నాం. వచ్చేనెల నుంచి జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తాం.
-నర్సింహారావు, పౌరసరఫరాల సంస్థ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్