వైరా టౌన్, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి అంతా కేసీఆర్ పుణ్యమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డిదంతా ముసుగు రాజకీయమని, ఆయన జీవితమూ అంతేనని విమర్శించారు. సీఎం కళ్లలో ఎప్పుడూ కేసీఆరే కన్పిస్తుండడంతో ఆయన ఆందోళన చెందుతున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 25 నెలల్లో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైరా మున్సిపాలిటీలోని 3, 7, 8, 20వ వార్డుల్లో గులాబీ శ్రేణులతో కలిసి గురువారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలతోనూ, అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. బాకీ కార్డులకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై ప్రతిఒక్కరూ ప్రశ్నించాలని కోరారు. ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పేందుకే ఈ ఎన్నికలే వేదికని స్పష్టం చేశారు.
అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి తన బూతుపురాణంలో తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా దిగజారుస్తున్నారని విమర్శించారు. వైరా మున్సిపాలిటీని గెలిపించాలని, ఇక్కడ ఎర్ర గులాబీ జెండాను ఎగరవేయాలని కోరారు. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోతు చంద్రావతి, బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు, బానోతు మంజులా మదన్లాల్, కట్టా కృష్ణార్జున్రావు, వనమా విశ్వేశ్వరరావు, బాణాల వెంకటేశ్వర్లు, అప్పం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.