సత్తుపల్లి టౌన్, మే 24 : తెలంగాణతో ఉద్యమ నేత కేసీఆర్ది పేగుబంధమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కానీ ఇదే తెలంగాణతో కాంగ్రెస్, బీజేపీ నేతలది రాజకీయ బంధమని విమర్శించారు. తెలంగాణ ఉనికి కోసం ఎవరు ఎంతటి పోరాటం చేశారో, ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమించారో ఇక్కడి ప్రజలందరికీ తెలుసునని అన్నారు. అందుకని ఉద్యమసారథి దీవించి పంపిన రాకేశ్రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. అదే సమయంలో అమూల్యమైన ఓటుతో బ్లాక్మెయిలర్ అయిన కాంగ్రెస్ అభ్యర్థిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరుతూ సత్తుపల్లి సిద్ధారంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గ్రాడ్యుయేట్ల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు అమెరికాలో ఉన్నతోద్యోగం వదులుకొని వచ్చిన గోల్డ్మెడలిస్టు రాకేశ్రెడ్డికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓటు వేసి అధిక మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు.
అతడిని పెద్దల సభకు పంపడం ద్వారానే పట్టభద్రుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అయితే బ్లాక్ మెయిలర్, చీటర్ అయిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విషయంలో పట్టభద్రులు ఆలోచించాలని కోరారు. అలాంటి వ్యక్తి పెద్దల సభకు వెళ్లడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. కొట్లాడి సాధించిన తెలంగాణను ముఖ్యమంత్రిగా ఉద్యమనేత కేసీఆర్ ఈ పదేళ్లలో అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తుచేశారు. కానీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పాలకులు ఆరు నెలల్లోనే అధోగతిపాలు చేశారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు గ్యారెంటీలంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ గ్యారెంటీల ఊసునే మర్చిపోయారని దుయ్యబట్టారు. మహాలక్ష్మి, రైతుభరోసా, పింఛన్లు, పేదలకు ఇళ్లు వంటి ఏ హామీనీ నెరవేర్చలేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఎందుకివ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నమ్మించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆఖరికి దానిని కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని దుమ్మెత్తిపోశారు. పెండింగ్ డీఏలు అడిగిన ఉపాధ్యాయులపై లారీచార్జీ చేయించారని అన్నారు. ధాన్యానికి బోనస్ పేరుతో అన్నదాతలనూ దగా చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి మోసపూరిత కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరారు.
తాను అధికారం కోసం ఓటు అడగడం లేదు, మీ కోసం పోరాడేందుకే ఓటు అడుగుతున్నాను. గతంలో పార్టీలతో సంబంధం లేకుండా మంచి వ్యక్తులను ఎన్నుకున్న ఇక్కడి పట్టభద్రులు.. ఈ ఎన్నికల్లోనూ అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. మోసగాళ్ల మాయమాటలను గమనించాలని కోరారు. తనను గెలిపిస్తే నిరుద్యోగులు, పట్టభద్రుల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతానని అన్నారు.
రైతు కుటుంబంలో పుట్టి బిట్స్పిలానీలో చదువుకుని గోల్డ్మెడల్ సాధించిన రాకేశ్రెడ్డి గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు తెస్తారు. కానీ బ్లాక్మెయిలర్ అయిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపిస్తే పిక్పాకెట్ గాళ్లను తీసుకొస్తాడని విమర్శించారు. యూట్యూట్ను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినందుకు గాను.. ఇదే తీన్మార్ మల్లన్నపై అనేక కేసులు నమోదయ్యాయని, 72 రోజులపాటు జైల్లో కూడా ఉన్నాడని గుర్తుచేశారు.
విద్యావంతుడికి, బ్లాక్మెయిలర్కు మధ్య జరుగుతున్న ఈ పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులందరూ విద్యావంతుడివైపే నిలవాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గుణగణాలు ఏంటో పట్టభద్రులు గమనించాలని కోరారు. రాకేశ్రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, దొడ్డా హైమావతి తదితరులు పాల్గొన్నారు.