స్వరాష్ట్రం దశాబ్దాల కల.. వందలాది మంది అమరవీరుల స్వప్నం.. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ.. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అన్న నినాదంతో మొదలైన ఉద్యమం నిప్పు కణికలా రగిలింది.. ఉద్యమ నేత కేసీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని నడిపారు. రెండు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఢిల్లీ పీఠం మెడలు వంచారు. తెలంగాణ సాధించారు. ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశారు. ఆ కల నెరవేరి నేటికి పదేళ్లు. అంతేనా.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా సైతం సమగ్రాభివృద్ధి సాధించింది. మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక చొరవ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. జిల్లా అభివృద్ధిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
ఖమ్మం, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దశాబ్దాల పాటు ఉమ్మడి పాలకులు తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపారు.. మన భాషను వెక్కిరించారు.. మన కట్టు బొట్టును హేళన చేశారు.. అలాంటి సందర్భంలో ‘మన నీళ్లు మనకే.. మన నిధులు మనకే.. మన నియామకాలు మనకే..’ అనే నినాదం ఉద్భవించింది. ఉద్యమ నేతగా కేసీఆర్ ఉదయించారు. రెండు దశాబ్దాల పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా సైతం సమగ్రాభివృద్ధి సాధించింది.
జనవరి 18న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరైన సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి 589 పంచాయతీల అభివృద్ధికి ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు, మేజర్ పంచాయతీలు పెద్దతండా, ఏదులాపురం, నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు పంచాయతీల్లో ఒక్కో పంచాయతీకి రూ.10 కోట్లు, నగరపాలక సంస్థ రూ.30 కోట్లు, సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఒక్కో పంచాయతీకి రూ.30 కోట్ల చొప్పున నిధులు ప్రకటించారు. అలాగే జిల్లా కేంద్రం పరిధిలో అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్కు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం పనులు పకడ్బందీగా కొనసాగుతున్నాయి. ఖమ్మం నగర పరిధిలోని మున్నేరుపై తీగల వంతెన నిర్మాణానికి ఇటీవల రూ.180 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ అయింది. త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఖమ్మం మన్సిపాలిటీ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా పాత మున్సిపల్ కార్యాలయంలో సౌకర్యాలు లేవు. మున్సిపల్ అధికారులు సౌకర్యవంతమైన వాతావరణంలో పనిచేసే వెసులుబాటు లేదు. ప్రజలకు పార్కింగ్ సౌకర్యమూ ఉండేది కాదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన నగరపాలక సంస్థ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణానికి ప్రభుత్వం రూ.23 కోట్లు విడుదల చేసింది. మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని కార్యాలయ నిర్మాణం పూర్తి చేయించారు. ప్రస్తుతం అన్ని వసతులతో కార్యాలయం అందుబాటులోకి వచ్చింది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లలో ప్రజలందరికీ మౌలిక వసతులు సమకూరాయన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.
ఐటీ రంగాన్ని జిల్లాకేంద్రాలకూ విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఐటీ హబ్లు నిర్మిస్తున్నది. వీటి ద్వారా అంతర్ జిల్లా అభ్యర్థులకు ఉపాధి కల్పించాలనేది ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ఖమ్మం నగరంలోని ఇల్లెందు క్రాస్రోడ్డులో రూ.25 కోట్ల వ్యయంతో ఐటీ హబ్ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఐటీ హబ్లో వందలాది మంది యువతీ యువకులు కొలువులు చేస్తున్నారు. త్వరలో రూ.36 కోట్ల నిధులతో రెండో దశ ఐటీ హబ్ పనులు ప్రారంభం కానున్నాయి.
ఒకప్పుడు ఎమ్మెల్యేలకు ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే ప్రజలు ఆయన స్వగృహానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉండేది. ఈ సమస్యలకు చెక్పెట్టేందుకు రాష్ట్ర సర్కార్ నియోజవర్గాల్లో ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల పరిధిలో ఒక్కో కార్యాలయానికి రూ.10 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. దీనిలో భాగంగా రూ.50 కోట్ల వ్యయంతో ఖమ్మం నగరంతో పాటు మిగతా నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.
జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్శాఖ ఖమ్మం నగరంలో పోలీస్ కమిషనరేట్ నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పుడు నగరంలోని పాత పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో అన్ని వసతులతో కమిషనరేట్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు సత్తుపల్లి, ఖమ్మం, ఖమ్మం రూరల్, వైరా పోలీస్ సబ్డివిజన్లలో ఏసీపీల కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.
40 ఏండ్లుగా మున్సిపల్ పీఠంపై కూర్చున్న పాలకులు ప్రజల మంచినీటి కష్టాల తీర్చలేకపోయారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.230 కోట్ల నిధులతో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయించింది. నగర పరిధిలోని ఒక్కో ఇంటికీ రోజుకు 150 లీటర్ల చొప్పున వచ్చే 30 ఏండ్ల పాటు సరఫరా చేసే విధంగా పైప్లైన్ల నిర్మాణం పూర్తయింది. గత పాలకులు రూ.74 కోట్ల నిధులతో చేపట్టిన మంచినీటి ప్రాజెక్ట్ సైతం ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం నగర పరిధిలోని 84 వేల గృహాలకు శుద్ధజలం అందుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు చిన్న చిన్న తండాలు, మారుమూల పల్లెలు, గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించింది. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఎన్నో పల్లెలు ఇప్పుడు పంచాయతీలుగా మారాయి. దీంతో పాలన సులభతరం అయింది. అలాగే ప్రభుత్వ చొరవతో సత్తుపల్లి, వైరా, మధిర పట్టణాలనూ మున్సిపాలిటీలయ్యాయి. అలాగే ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు, సత్తుపల్లి, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని వందలాది గ్రామాలను స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోకి తీసుకురావడంతో అభివృద్ధి సులభతరమైంది.
దశాబ్దాల క్రితం నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఖమ్మంలో బస్టాండ్ నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. ఆ నిధులతో బస్టాండ్ అందుబాటులోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు పట్టణ జనాభా పెరుగుతూ వస్తున్నది. క్రమంగా వాహనాల వినియోగం పెరిగింది. ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం గా మారాయి. పట్టణం నగరపాలక పాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత సమస్య జటిలమైంది. సమస్యను తీవ్రంగా పరిగణించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నూతన బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.25 కోట్ల నిధులతో నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్లో బస్టాండ్ను నిర్మించారు. రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ బస్టాండ్ను ప్రారంభించారు. దీంతో నగరవాసుల సమస్యలకు పరిష్కారం లభించింది.
సుమారు రూ.2 వేల కోట్ల పైచిలుకు నిధులతో ఖమ్మం నగరం హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి సాధించింది. దీంతో పాటు నగరపాలక సంస్థకు ఏటా విడుదలవుతున్న రూ.100 కోట్ల నిధులతో పాలకవర్గం నగరంలో అంతర్గత రహదారులు, నీటి సరఫరా, డ్రైన్లు, సైడ్ కాలువల నిర్మాణాలు చేపడుతున్నది. రూ.50 కోట్లతో నగరంలో పలుచోట్ల ఏసీ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు పూర్తి చేయించింది.
జిల్లాలోని ప్రతి ఇంటికీ శుద్ధజలం అందించేందుకు అధికారులు సరఫరా విభాగాలను పాలేరు, వైరా, గోదావరి సెగ్మెంట్లుగా విభజించారు. నీటి సరఫరాకు గతంలో అందుబాటులో ఉన్న 1,605 ట్యాంక్లే కాక కొత్తగా 519 ట్యాంక్ల నిర్మాణాలను పూర్తి చేశారు. పాలేరు, వైరా సెగ్మెంట్ల పరిధిలో నూరుశాతం పైపులైను పనులు పూర్తయ్యాయి. 21 సబ్స్టేషన్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మూడు సెగ్మెంట్ల పరిధిలో రూ.3389 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 4.75 లక్షల కుటుంబాలకు ప్రతిరోజూ శుద్ధజలం అందుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రోజుకు 135 లీటర్లు, మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో ఇంటికి 150 లీటర్ల చొప్పున తాగునీరు అందుతున్నది. పాలేరు రిజర్వాయర్ నుంచి ఆరు మండలాలతో పాటు ఖమ్మం కార్పొరేషన్, వైరా రిజర్వాయర్ నుంచి 11 మండలాలతో పాటు ఒక మున్సిపాలిటీ, గోదావరి సెగ్మెంట్ నుంచి మూడు మండలాలతో పాటు ఒక మున్సిపాలిటీకి నీరు సరఫరా అవుతున్నది.
గోదావరిపై ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మించి కాలువల ద్వారా నదీ జలాలను ఉమ్మడి జిల్లాకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిష్ఠాత్మకంగా సీతారామ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించింది. ఇది అతిపెద్ద ఎత్తి పోతల పథకం. ప్రాజెక్ట్ పూర్తయితే ఉభయ జిల్లాల పరిధిలో 4.93 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన గడువులోపు పనులు పూరి చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కృషి చేస్తున్నారు.
రూ.4 కోట్లతో నగరంలోని లకారం చెరువు సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. రూ.100 కోట్ల నిధులతో గోళ్లపాడు చానల్ పనులు పూర్తయ్యాయి. చానల్పై సుందర వనాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.70 కోట్లతో ధంసలాపురం ఆర్వోబీ అందుబాటులోకి వచ్చింది. ముస్తాఫానగర్ నుంచి ధంసలాపురం గేటు వరకు నాలుగు లైన్ల రహదారి పనులు పూర్తయ్యాయి. నగరంలోని టేకులపల్లిలో 1,210 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్ల అప్పగింత జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం తిరుమలాయపాలెం మండలంలో రూ.335.59 కోట్లతో భక్త రామదాసు ఎత్తిపోతల పనులను చేపట్టింది. పనులు ప్రారంభించిన కేవలం 11 నెలల సమయంలోనే ప్రాజెక్ట్ పూర్తయింది. భూసేకరణకు రూ.16 కోట్లు, మోటర్లు, పంపులకు రూ.32.44 కోట్లు, పైప్లైన్ల నిర్మాణానికి రూ.163.73 కోట్లతో ఇతర నిధులతో విద్యుత్ సబ్స్టేషన్, సివిల్, హైడ్రో మెకానికల్ పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ ద్వారా ఆయకట్టు పరిధిలో 60 వేల ఎకరాలు సస్యశ్యామలమవుతున్నాయి. తిరుమలాయపాలెం మండల పరిధిలో 17,286 ఎకరాలు, కూసుమంచి మండలం 23,448 ఎకరాలు, నేలకొండపల్లి మండలం 2,958 ఎకరాలు, ఖమ్మం రూరల్ మండలం 12,605 ఎకరాలు, మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల పరిధిలో 2,440 ఎకరాలకు ఇప్పుడు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. అంతేకాదు పొరుగు జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లాలోని 1,120 ఎకరాలకూ నీరు అందుతున్నది.
పల్లె, పట్టణ ప్రగతి అమలులో జిల్లా ముందంజలో ఉన్నది. ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు మూడు మున్సిపాలిటీలు, 589 గ్రామ పంచాయతీల్లో పథకం విజయవంతమైంది. ప్రతి పట్టణం, గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి వచ్చింది. పారిశుధ్య పనులు, చెత్తను తరలించేంపదకు ట్రాక్టర్, హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలకు నీరు పెట్టేందుకు ట్యాంకర్ సమకూరాయి. వాలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి వచ్చాయి. నిరుపయోగంగా ఉన్న, శిథిలమైన బావులు నేలమట్టమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. సాగుపై ప్రత్యేకంగా వ్యవసాయ క్యాలెండర్ను రూపొందించింది. జిల్లా వ్యవసాయశాఖ పకడ్బందీగా క్యాలెండర్ను అమలు చేస్తున్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే రైతులు సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నది. వానాకలంలో వరిలో సన్నరకం సాగు చేయాలని, పత్తి పంటతో పాటు అపరాలు సాగు చేయాలని సూచిస్తున్నది. భౌగోళిక, సాగునీటి వనరుల అంశాలను పరిగణలోకి తీసుకుని నేలల స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేయిస్తున్నది. రైతులు పండించిన పంటకు సర్కార్ గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నది.