భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ఒక్క చెరువుతో ఊరికి ఎన్నో ఉపయోగాలు. గ్రామానికి ఆదాయ వనరు. నాడు ఆంధ్రా పాలనలో చెరువులు లేక ఊర్లన్నీ బోసిపోయేవి. నెర్రలుబారిన చెరువులు వాన వస్తే తూటికాడలతో నిండిపోయేవి. వేసవిలో నీరు లేక వెలవెల పోయేవి. ఇప్పుడు అవే చెరువులు రెండు పంటలకు సాగునీరు అందించి జలకళతో తళుక్కున మెరుస్తున్నాయి. మండువేసవిలో సైతం నీరు పుష్కలంగా ఉండడంతో రెండు పంటలకు నీరు అందుతుందంటే అది తెలంగాణ సర్కారు పుణ్యమే. అలాంటి చెరువులు 2014 సంవత్సరానికి ముందు జిల్లాలో 72 ఉండగా.. ప్రస్తుతం మిషన్ కాకతీయ పథకం వచ్చాక 743 చెరువులకు చేరుకున్నాయి. ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలను ఆధునీకరణ చేసి అటు వ్యవసాయానికి, ఇటు చేపల పెంపకానికి ఉపయోగపడేలా చేసింది తెలంగాణ సర్కారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా గురువారం ‘చెరువుల పండుగ’ నిర్వహిస్తున్నారు. మన చెరువుల్లో ఉత్పత్తి అయిన చేపల వంటకాలను మూడ్రోజులపాటు ప్రదర్శన చేయనున్నారు.
ఏటా కోటికి పైగా చేపల పెంపకం
చేపపిల్లలను పెంచడంతోపాటు వాటిపై ఆదాయం పొందేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ సత్ఫలితాలనిస్తున్నది. మన చెరువుల్లో పెరిగే చేపల ద్వారా మనకు ఆదాయం వచ్చే విధంగా మత్స్యశాఖ ద్వారా ఏటా ఉచితంగా సొసైటీ సభ్యులకు చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. గత ఏడాది జిల్లాలో 698 చెరువుల్లో 1,79 లక్షల చేపపిల్లలను వదిలారు. ఇందులో 658 సీజనల్ చెరువులు ఉండగా 40చెరువుల్లో శాశ్వతంగా నీరు ఉండే చెరువులున్నాయి. ఇవేకాక మూడు రిజర్వాయర్ల్లో కూడా చేపలు పెరుగుతున్నాయి. దీంతో ప్రతి ఏటా మత్స్యకారుల కుటుంబాలకు 20 నుంచి 30 వేల వరకు ఆదాయం సమకూరుతున్నది. సొసైటీగా ఏర్పడిన ప్రతి సభ్యుడికి చేపల వేటలో శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని పెంచుతున్నారు. ఈ ఏడాది 743 చెరువుల్లో 1,77 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేశారు. ఇప్పటికే ఉత్పత్తి కూడా వచ్చేసింది. ఈ ఏడాది 9,800 టన్నులు చేపలు ఉత్పత్తి అయినట్లు ఆయా సంఘాల సభ్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఆయా సంఘాల సభ్యులకు రూ.7 కోట్ల వ్యయంతో 75శాతం సబ్సిడీపై మొబైల్ వాహనాలు, టూ వీలర్ వాహనాలను అందజేసింది.
చేపల సొసైటీలు బలోపేతం
నాడు ఇద్దరు ముగ్గురుకే పరిమితమైన మత్స్యకారులు నేడు సొసైటీ ఏర్పాటుతో బలోపేతమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 60 సొసైటీలను ఏర్పాటు చేసుకున్నారు. 2,736 సభ్యులు ఈ సొసైటీల్లో సభ్యత్వం కలిగి ఉన్నారు. గిరిజనులు కూడా ఇందులో సభ్యులుగా ఉండి చేపల విక్రయాలతోపాటు పెంపకంతో భాగస్వాములవుతున్నారు.
వ్యాపారం బాగుంది
చేపల వ్యాపారంపై ఆధారపడి బతుకుతున్నాం. ఉచితంగా ఇచ్చిన చేపపిల్లల వల్ల చెరువుల్లో మేమే చేపలు పట్టుకుని అమ్ముకుంటున్నాం. వలలు కూడా ఇచ్చారు. తెలంగాణ వచ్చాక ఉచితంగా చేపపిల్లలను చెరువుల్లో వదులుతున్నారు. ప్రతి ఏటా సభ్యులకు మంచి ఆదాయం వస్తున్నది. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ. ఏ కాలంలోనైనా మా చెరువులో పుష్కలంగా నీరు ఉంటుంది. రొయ్యలు కూడా వేశాం. బాగా ఎదుగుతున్నాయి.
– సూర్యం, చేపల సొసైటీ అధ్యక్షుడు సింగభూపాలెం
మత్య్స సంపద బాగా పెరిగింది
నాడు చెరువులు లేక రైతులు ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు జిల్లాలో 743 చెరువులు ఉన్నాయి. ప్రతి చెరువు సాగునీటితోపాటు చేపల పెంపకానికి ఉపయోగపడుతున్నది. రైతులు, మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేటి నుంచి మూడ్రోజులపాటు చెరువుల పండుగతోపాటు చేపల వంటకాల ప్రదర్శన కూడా ఉంటుంది. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వంటకాలను ఏర్పాటు చేస్తున్నాం.
– వీరన్న, జిల్లా మత్స్యశాఖ అధికారి