కూసుమంచి, జూన్ 25 : నాడు మత్స్యకారులను పట్టించుకున్న వారే లేరు. నేడు తెలంగాణ ప్రభుత్వ పాలనలో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. చెరువుల పునరుద్ధరణ, చేపపిల్లల పంపిణీ, సబ్సిడీపై వాహనాలు తదితర పథకాలు వారి జీవితాలను సమూలంగా మార్చేశాయి. అంతేకాక ఆధునిక పద్ధతి ‘కేజ్ కల్చర్’ విధానంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. ఒక యూనిట్కు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుండగా.. ప్రభుత్వం 80శాతం సబ్సిడీపై రుణాన్ని అందించి వారిని ఆర్థికంగా మరింత బలపరుస్తున్నది. పాలేరులో మత్స్యకారులు ఈ కేజ్ కల్చర్లో చేపలు పెంచుతూ అధిక ఉత్పత్తి సాధించి మంచి లాభాలు పొందుతున్నారు. ఒక్కటిగా మొదలైన కేజ్ కల్చర్ నేడు 10 యూనిట్లలో చేపలు పెంచుకుంటున్నారు. పాలేరులో కేజ్ కల్చర్పై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
జార్ఖండ్లో ప్రయోగాత్మకంగా మొదలైన పంజర చేపల పెంపకం పాలేరు రిజర్వాయర్ పరిధిలోని మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నది. 2015 లో మొదటిసారిగా ఒక్క కేజ్ కల్చర్ ఏర్పాటు చేసిన మత్స్యశాఖ ప్రస్తుతం 10 యూనిట్ల ద్వారా 360 టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ మత్స్య పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన పంజర చేపల పెంపకం మంచి లాభాల బాటలో నడుస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏర్పాటు చేస్తున్న పంజర చేపల పెంపకంలో చెరువుల్లో చేపలు పెంచే విధానం కంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చేపలు పెంచడం, అధిక దిగుబడులు సాధించడం, సులువుగా పర్యవేక్షణ వంటి వాటితో మంచి లాభాలు గడిస్తున్నారు. పంజర చేపల పెంపకంపై ఆసక్తి గల మత్స్యకారులు 10మంది ఒక గ్రూపుగా ఏర్పడి యూనిట్ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
80శాతం సబ్సిడీ..
కేజ్ కల్చర్ విధానంలో ఒక యూనిట్ ఏర్పాటుకు రూ.30 లక్షల ఖర్చు అవుతున్నది. ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా 80శాతం సబ్సిడీపై రుణాన్ని మంజూరు చేస్తున్నది. 10మంది రైతులు 20శాతం వాటాతో యూనిట్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. సామాన్యంగా వచ్చే ఆదాయంతోపాటు అదనంగా సంవత్సరానికి ఒక్కో రైతు రూ.లక్షకు పైనే ఆదాయాన్ని పొందుతున్నాడు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో టెండర్లు పిలిపించి యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. రూ.14 లక్షలు యూనిట్ ఏర్పాటుకు, మెటీరియల్ రూ.16 లక్షలు, చేపపిల్లలు, దాణా పర్యవేక్షణ వాటిని 9నెలల పాటు కాపాడుకోడానికి ఖర్చు అవుతుంది. వీటిల్లో రూ.24 లక్షలు 80శాతం సబ్సిడీ ఇచ్చి మత్స్య రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఒక యూనిట్ ఏర్పడాలి అంటే మత్స్యశాఖకు 10మంది రైతులు కలిసి ఒక సంఘంగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాలేరులో 90మంది రైతులు కలిసి 9 యూనిట్లు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం మాత్రమే మత్స్య రైతులకు సబ్సిడీ అందిస్తారు. రెండో సంవత్సరం రైతులు సొంతంగా యూనిట్ను నడుపుకోవాల్సి ఉంటుంది. రూ.14 లక్షలతో ఏర్పాటు చేసిన కేజ్ యూనిట్లల్లో మత్స్యకారులు సొంతంగా చేపలు పోసుకుని వాటిని పెంచుతున్నారు. కొత్త యూనిట్కు మొదటిసారి మాత్రమే 80శాతం సబ్సిడీ అందిస్తున్నారు.
చేపల ఉత్పత్తి…
ప్రతి యూనిట్కు 10 కేజ్లు ఉంటాయి. ఒకొక్కటి 6 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు ఉండే విధంగా కేజ్ల నిర్మాణాలు చేపడతారు. ప్రతి కేజ్లో 5 వేల చేపపిల్లలను వదులుతారు. వాటిల్లో 80శాతం 4వేల పిల్లలు బతికి పెద్దవిగా అవుతాయి. 9నెలల కాలంలో వాటి సైజ్ కేజీ వరకు వస్తుంది. కేజీ రూ.80 నుంచి 100వరకు అమ్ముతున్నారు. ఒక యూనిట్లో 10 కేజ్ల్లో ప్రతి కేజ్లో 5 వేల వంతున 50వేల చేప పిల్లలు పోస్తే వాటిల్లో 40వేల పిల్లలు కచ్చితంగా బతుకుతాయనేది శాస్త్రీయంగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త డాక్టర్ విద్యాసాగర్రెడ్డి, శాంతన్న తెలిపారు. ప్రతి కేజ్లో 4 టన్నుల వంతున యూనిట్లో 10 కేజ్ల్లో 40 టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం పాలేరులో 9 యూనిట్లలో కలిపి 90 కేజ్ల్లో 360 టన్నుల చేపలు ఉత్పత్తి జరుగుతున్నది.
శిక్షణకు జార్ఖండ్ పోయా..
2015లో పాలేరులో కేజ్ కల్చర్ మొదలుపెట్టడానికి నాతోపాటు 10 మందిని జార్ఖండ్ రాష్ర్టానికి పంపించారు. అక్కడ 15రోజులపాటు ఉండి అనేక విషయాలను నేర్చుకొని ఇక్కడికి వచ్చి కేజ్లు ఏర్పాటు చేశాం. మహారాష్ట్ర నుంచి వచ్చిన కేజ్లను నిర్మించి మాకు అప్పగించిపోయారు. 6 సంవత్సరాలైనా ఇప్పటికీ బాగానే ఉన్నాయి. పంజర చేపల పెంపకంలో మంచి లాభాలు ఉన్నాయి. ప్రతి కేజ్లో 4 టన్నులకు తగ్గకుండా చేపలు ఉత్పత్తి అవుతాయి. వాటిని బయట మార్కెట్లో అమ్ముకొంటున్నాం. కేజ్ కల్చర్తో సునాయాసంగా దాణా, పట్టుబడి, చేపల ఎదుగుదలపై పర్యవేక్షణ కలుగుతున్నది.
– బత్తుల ఉప్పయ్య, మత్స్యకారుడు
కేజ్ కల్చర్తో మంచి దిగుబడి
పాలేరులో 10 కేజ్ కల్చర్ యూనిట్లు ఉన్నాయి. వాటిల్లో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. చేపలకు ఏదైనా రోగం వస్తే వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మత్స్యకారులకు అతిదగ్గరలో చేపల ఎదుగుదల వాటిని పట్టుకునే విధంగా తేలికగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు మంచి ప్రోత్సాహకాలను అందిస్తున్నది. 80శాతం సబ్సిడీపై కేజ్ కల్చర్ యూనిట్ను ఏర్పాటు చేయడం వల్ల వారికి మంచి ఆదాయం సమకూరుతున్నది. పాలేరులోని కేజ్ కల్చర్లో చేపలు మంచి ఎదుగుదలతో ఏర్పాటు చేసిన వారికి రిజర్వాయర్ మీద వచ్చే ఆదాయం కంటే అదనంగా రూ.లక్షకు పైగా ఆదాయం వస్తున్నది. చిన్నచిన్న చెరువుల్లోనూ కేజ్ కల్చర్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో మత్స్యకారులు లాభాలు పొందాలి.
– డాక్టర్ విద్యాసాగర్రెడ్డి, సీనియర్ సైంటిస్ట్
కేజ్ కల్చర్ అలవాటైంది..
కేజ్ కల్చర్తో మంచి దిగుబడులు వచ్చాయి. మొదట ఎలా ఉంటుందోనిని అనుకున్నాం కానీ క్రమంగా మాకు కేజ్కల్చర్ అలవాటైంది. సబ్సిడీ వచ్చింది. 10మంది కలిసి గ్రూపుగా ఏర్పడి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాం. 40 టన్నుల దాకా దిగుబడి వచ్చింది. దాణా, నిత్యం పర్యవేక్షణ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పంజర చేపల పెంపకంతో మంచి దిగుబడులే కాకుండా లాభాలు బాగా వస్తాయి. జార్ఖండ్ వెళ్లి శిక్షణ పొందాం.
– బత్తుల నర్సయ్య, పాలేరు మత్స్యకారుడు