ఖమ్మం కల్చరల్/ కూసుమంచి రూరల్, మార్చి 17: నవ మానవుడి జీవితం.. సప్తవర్ణాల సమ్మిళితం. ఇంద్రధనుస్సుకు ప్రతిబింబం. అందులోని ఏడు రంగులు.. మనిషిలోని అనేక గుణగణాలకు ప్రతీకలు. ప్రకృతిలోని రంగులన్నీ జీవితతత్వాన్ని బోధిస్తాయి. రంగులతో చేసుకునే పండుగ హోలీ. ఎరుపు కోపానికి, ఆకుపచ్చ అసూయకు, పసుపు ఆనందానికి, గులాబీ ప్రేమకు, నీలం విశ్రాంతికి, తెలుపు శాంతికి, కాషాయం త్యాగానికి, ఊదా జ్ఞానానికి ప్రతీకలు. అంటే ప్రతి మనిషి ఓ ఇంద్రధనుస్సే. ప్రకృతి నిరంతరం ఏవిధంగానైతే మార్పులకు లోనవుతుందో మనిషిలోని భావోద్వేగాలూ అదే విధంగా మారుతూ ఉంటాయి. వీటికి సంకేతంగా, ఆచార వ్యవహారంగా, పురాణగాథల సంప్రదాయంగా, వసంతానికి స్వాగత వేడుకగా రంగురంగుల రంగేలీని జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. చలికి, పొగమంచుకు వీడ్కోలు చెప్పి, వెచ్చదనాన్నిచ్చే వసంతానికి స్వాగతం పలికే పండుగ ఇది. ప్రకృతికాంతకు రంగులతో స్వాగతం పలకడమే హోలీ. రాబోయే వసంత రుతువుకు స్వాగత సన్నాహమే ఈ పండుగ.
హిరణ్యకశ్యపుడి సోదరి హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటల్లో వేసినప్పుడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు దైవలీలతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. హోలిక ఆ మంటల్లో దహనమవుతుంది. దీనికి ప్రతీకగా హోలీ పండుగ ముందు రోజు హోలికా బొమ్మను మంటల్లో వేసి కాముడి దహనంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పండుగకు ఇంకో ప్రాచుర్యం ఉంది. శివుడి తపస్సును భంగపర్చడానికి అతడిపై పూలబాణాలు వదిలిన కామదేవుడి శరీరాన్ని శివుడు నాశనం చేస్తాడు. తరువాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుడి శరీరాన్ని బూడిద చేస్తాడు. కామదేవుడి భార్య రతీదేవి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మళ్లీ బతికిస్తాడు. రతీదేవికి మన్మథుడు శరీర రూపంలో సజీవుడై ఉండేటట్లు మాంగళ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రోజు పాల్గుణ పూర్ణిమ కాబట్టి కాముడి పున్నమిగా జరుపుకుంటారు. దీంతో ఫాల్గుణ పౌర్ణమి ముందు రోజున భోగి మంటలు వేసి కాముడి బొమ్మను దహనం చేస్తారు. కాగా, జిల్లా ప్రజలందరూ గురువారం రాత్రి తమ కూడళ్లలో ఆనందోత్సాహాలతో కాముడి దహన వేడుకలు జరుపుకున్నారు.
వసంతకాలంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. దీంతో వైరల్ వ్యాధులు ప్రబలుతాయి. సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల అవి ఔషధంగా పని చేసి.. వీటిని నివారిస్తాయని ఆయుర్వేదం చెబుతున్నది. మోదుగు పూలు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటితో తయారు చేసే సహజ రంగులు వాడడం వల్ల ఈ కాలంలో వచ్చే అంటు వ్యాధులను నియంత్రించొచ్చని శాస్త్రం చెబుతోంది. రసాయన రంగులతో టాక్సిక్ చెడు ప్రభావం ఉంటుంది. రసాయన రంగుల్లో లెడ్ ఆక్సైడ్ కలిగి ఉండి మూత్రపిండాల వ్యాధులు, చర్మవ్యాధులు, ఎలర్జీ వంటివి వస్తాయి.
హోలీ వేడుకలకు ప్రత్యేకతగా నిలిచిన లోక్యాతండాలో ఈ నెల 18 నుంచి 20 వరకు సంప్రదాయ ఉత్సవాలు జరుగుతాయి. సుమారు రెండు వేల జనాభా ఉన్న లోక్యాతండా పంచాయతీలో హోలీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ ఊరి ఉద్యోగులు, ఆడబిడ్డలు తరలివస్తారు. శుక్రవారం కాముని దహనంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు కోలాటం, రెండోరోజు డూండీ నిర్వహిస్తారు. మూడో రోజు రంగోలీతో వేడుక ముగుస్తుంది.
రంగుల పొడులు.. గులాల్, రంగు నీళ్లు కలిపి నీటిని చిమ్మే గొట్టాలతో పరస్పరం రంగులు చల్లుకునే ఆనంద కేళీయే హోలీ. పాల్గుణ శుద్ధ పౌర్ణమి శుక్రవారం నాడు ఈ పండుగను జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా పలు రంగులను తమ స్నేహితులు, బంధువులపై చల్లుకుంటూ ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు. దీనిని వసంతోత్సవమని, పాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చేది కాబట్టే పాల్గుణ పౌర్ణమి, హోలికా పౌర్ణమి, కాముని పున్నమి, డోలికోత్సవం అని పిలుస్తారు. ఈ రోజున చంద్రుడు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో ఉంటాడని ప్రతీతి. దీంతో ఈ రోజున చంద్ర పూజ జరుపుకుంటారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు.
మొదటి రోజు శుక్రవారం ఉత్సవాల ప్రారంభంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి మహిళలు, పురుషులు తమ బంధువులు, స్నేహితులతో కలిసి మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామ ప్రధాన కూడలికి చేసుకుంటారు. కోలాటాలతో ఆడిపాడుతారు. తెల్లవారుజామున కాముని దహనం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల్లో డూండీ కార్యక్రమం ప్రత్యేకమైంది. రెండోరోజు శనివారం వందలాదిగా వచ్చిన బంధువులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. యువతుల తల్లిదండ్రులు ఉపవాసదీక్ష పూర్తి చేసి, బంధుమిత్రులను ఆహ్వానించి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు.
చివరిదైన ఆదివారం రంగోలీ ఉత్సవం జరుగుతుంది. పదేళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ రంగోలి ఉత్సవాల్లో పాల్గొంటారు. గత ఏడాది జరిగిన హోలీ అనంతరం జన్మించిన ఈ గ్రామంలో పుట్టిన మగబిడ్డలకు ఈ రోజున నామకరణం చేస్తారు.
‘హోలీ ఉత్సవాలకు మా తండా ఎంతో ప్రత్యేకం. 70 ఏళ్లుగా మా పూర్వికులు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని మేమూ కొనసాగిస్తున్నాం. ఇతర ప్రాంతాల్లో ఉన్న మా తండాకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులతోపాటు ఆడబిడ్డలు, అల్లుళ్లు, బంధువులు తరలివస్తారు. ఈ మూడురోజులు తండాలో పండుగ వాతావరణం నెలకొంటుంది.
-జర్పుల బాలాజీనాయక్, ఎంపీటీసీ, లోక్యాతండా