కూసుమంచి, ఫిబ్రవరి 27: ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం సాగునీటి కోసం రోడ్డెక్కారు. అనధికారికంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. తెలిసిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి పాలేరు జలాశయానికి ఏటా సీజన్లకు సాగు జలాలు విడుదలవుతాయి. కానీ ఎగువన సాగర్ ప్రాజెక్ట్లో జలాలు నిండుకోవడంతో పాలేరు జలాశయం ఎడారిని తలపిస్తున్నది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 13.5 అడుగులకు పడిపోయింది. మిగిలిన జలాలు కూడా ‘మిషన్ భగీరథ’ సరఫరా కోసమే అధికారులు రిజర్వ్ చేశారు. రిజర్వాయర్ కాలువలపై ఆధారపడి జిల్లాలో మెజారిటీ ఆయకట్టు ఆధారపడి ఉంటుంది. కూసుమంచి, నేలకొండపల్లి మండలాల ఆయకట్టు సాగునీటికి 90శాతం రిజర్వాయర్పైనే ఆధారపడి ఉంటుంది. ఆయా మండలాల్లో ప్రస్తుతం యాసంగిలో సుమారు 5వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ఇటీవల ఆయకట్టు రైతులు పాలేరు రిజర్వాయర్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. అనధికారికంగా పాతకాలువ నుంచి జలాలను దిగువకు వదిలారు. అధికారులు, పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఇరిగేషన్ అధికారులు పాతకాలువ గేట్ల వద్ద ముళ్లకంప వేశారు.
ఇది జరిగి రెండు వారాలు కాకముందే రైతులు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి మంగళవారం మరోసారి ఆందోళనకు దిగారు. రిజర్వాయర్ పాత కాలువ గేట్ల వద్దకు వెళ్లి ముళ్లకంపను తొలగించారు. రిజర్వాయర్ కట్టపై నుంచి వాహన రాకపోకలను అడ్డుకుని రాస్తారోకో చేశారు. అనంతరం గేట్లను తెరిచి దిగువకు జలాలు వదిలారు. సమాచారం అందుకున్న ఏసీపీ బి.తిరుపతిరెడ్డి, ఖమ్మం రూరల్ సీఐ రాజిరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ ఆనంద్, ఈఈలు వెంకటేశ్వర్లు, అనన్య, డీఈలు రత్నకుమారి, మధు, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాసరావు, డీఈ మురళీ కృష్ణ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. కొన్ని గంటల పాటు రైతులతో చర్చలు జరిపారు. సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, కనీసం ఒకటి రెండు తడులకైనా నీటిని వదలాలని రైతులు పట్టుబట్టారు. చివరకు ఇరిగేషన్శాఖ సీఈ విద్యాసాగర్ రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. అనంతరం అధికారులు పాతకాలువ గేట్లను మూసివేయించారు. తర్వాత రైతులు తమ స్వస్థలాలకు వెళ్ల కుండా రాత్రి రిజర్వాయర్ కాలువపైకి వచ్చి ఆందోళన చేశారు. అధికారులు గేట్లకు వెల్డింగ్ పెట్టకుండా అడ్డుకొని అక్కడే చలిమంటలు వేసుకొని కాపలాగా ఉన్నారు. కాగా.. అధికారులు సర్ది చెప్పడంతో రైతులు ఇళ్లకు వెళ్లారు.