చండ్రుగొండ, జూన్ 7 : మండలంలోని ప్రధాన సాగు నీటి వనరు వెంగళరావు సాగర్ ప్రాజెక్టు అలుగు నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని సీతాయిగూడెం, దామరచర్ల, ఇమ్మడిరామయ్యబంజర, చండ్రుగొండ, తిప్పనపల్లి, మహ్మద్నగర్ గ్రామాలకు చెందిన 2,200 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి.
అనధికారికంగా మరో 500-600 ఎకరాల భూమి అదనంగా ఉంది. అలుగు నిర్మాణానికి ప్రభుత్వం గత ఏడాది రూ.33 కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది మే చివరి నాటికి పనులు పూర్తవుతాయని, ఆయకట్టు సాగుకు ఇబ్బంది లేకుండా చేస్తామని రైతులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ గాల్లో కలిసింది. నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్.. పనులను అసంపూర్తిగా వదిలేశారు.
ఈ ఏడాది అధిక వర్షాలు పడితే పంటలు మునుగుతాయేమోనని ఆయకట్టు రైతులు భయాందోళనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో, పనులు పూర్తిచేయని సదరు కాంట్రాక్టర్కు ఇరిగేషన్ శాఖ అధికారులు నోటీస్ ఇచ్చారు. “పనులు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్కు నోటీస్ ఇచ్చాం. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వరద ముంపు నుంచి ఆయకట్టు సాగు దెబ్బతినకుండా ఆరు అడుగుల రింగ్ బండ్ ఏర్పాటు చేస్తాం” అని, ‘నమస్తే తెలంగాణ’తో ఇరిగేషన్ శాఖ డీఈ సుబ్రహ్మణ్యం చెప్పారు.