అశ్వారావుపేట టౌన్, మార్చి 11 : ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న రైతులు పంటకు నీరందక కళ్లముందు ఎండిపోతుంటే చూడలేకపోయారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తలాకొంత వేసుకుని పంట కాలువలను బాగు చేయించుకొని సాగునీరు అందేలా చేసుకున్నారు పట్టణంలోని వెంకమ్మ చెరువు ఆయకట్టు రైతులు. చెరువు కింద ఆయకట్టు 1,100 ఎకరాలు ఉండగా.. ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు 400 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 40 మంది రైతులు సుమారు వంద ఎకరాల్లో సాగు చేస్తున్న వరి పంట పొట్ట దశలో ఉన్నది. ఈ భూములకు సాగునీరు అందించే మధ్య కాలువ ముళ్ల పొదలు, గడ్డి, పూడికతో పేరుకుపోయింది. దీంతో వంద ఎకరాలకు సాగునీరందక పంట ఎండిపోయే స్థితిలో ఉన్నది.
ఈ క్రమంలో పంట కాలువ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని రైతులు సిరిగినీడి దుర్గారావు, కొత్త వాసు, చెన్నూరి రామకృష్ణ తదితరులు ఆరోపించారు. దీంతో కళ్ల ముందు ఎండిపోతున్న పంటను చూడలేని రైతులు తలాకొంత వేసుకొని పంట కాలువను బాగు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం పొక్లెయిన్ను తెప్పించి కాలువలోని ముళ్ల పొదలు, గడ్డి, పూడిక మట్టిని తొలగించి నీరు పారే విధంగా చేసుకున్నారు. ఇప్పటికైనా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా పంట కాలువలు బాగు చేయించి సాగు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.