ఇల్లెందు రూరల్, మార్చి 18: రెక్కలు ముక్కలు చేసుకుని.. అప్పో సప్పో చేసి వరి సాగు చేస్తున్నామని, తీరా సాగు ప్రారంభించాక పైరు ఎదగడం లేదని, డీలర్లు నకిలీ విత్తనాలు అంటగంటడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మండలానికి చెందిన పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. కొమరారం, బోయితండా, పోచారం, పోలారంతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు సుమారు 50 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. మొదట్లో పైరు బాగానే ఉన్నప్పటికీ రెండు నెలల తర్వాత ప్రాథమిక దశలోనే పక్వానికి రావడం, ఎదుగుదల లేకపోవడం, కాండాలు దృఢం కాకపోవడాన్ని గమనించారు. డీలర్లు ఇచ్చిన నకిలీ విత్తనాలతోనే ఈ పరిస్థితి వచ్చిందని నిర్ధారించుకుని సోమవారం మూకుమ్మడిగా మీడియాకు గోడు వెల్లబోసుకున్నారు.
ఒక్కో ఎకరానికి సుమారు రూ.30 వేల చొప్పున అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం పంట చేతికొచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నకిలీ విత్తనాలు అంటగట్టిన డీలర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ‘నమస్తే’ ఏవో సతీష్ను వివరణ కోరగా.. ‘డీలర్లు నకిలీ విత్తనాలు అంటగట్టారని రైతులు మాకు ఫిర్యాదు చేశారు. ఆయా దుకాణాల యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. రైతుల నుంచి విత్తనాలు సేకరించి వాటిని ల్యాబ్కు పంపించాం. విత్తనాలు నకిలీవి అని తేలితే డీలర్లపై చర్యలు తీసుకుంటాం..’ అని సమాధానమిచ్చారు.