అన్నపురెడ్డిపల్లి, ఏప్రిల్ 11 : జిల్లావ్యాప్తంగా 128 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని, రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. గురువారం గుంపెన, నామవరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ గుంపెనలో ధాన్యం తేమ శాతం, గోడౌన్లను పరిశీలించారు. నామవరంలో కాంటాలను ప్రారంభించారు. పంట దిగుబడి ఎలా ఉంది.. కేంద్రాల్లో ధాన్యం అమ్ముతున్నారా.. ఏమైనా సమస్యలు ఉన్నాయా.. అని కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే నర్సాపురంలో రైతుల కోరిక మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కేంద్రంలో గన్నీ బ్యాగులు, తేమ పరీక్ష పరికరాలు, తూర్పారబట్టే యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు.
కౌలు రైతుల జాబితా రూపొందించి ముందస్తుగా టోకెన్లు ఇవ్వాలని, ధాన్యం డబ్బుల చెల్లింపులో ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మండలంలో తాగునీటి పరిస్థితి గురించి ఎంపీడీవో మహాలక్ష్మి, మిషన్ భగీరథ ఏఈ సాయికృష్ణలను అడిగి తెలుసుకున్నారు. రాజాపురంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను పరిశీలించారు. తాగునీటి సరఫరా గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సీతారామ ప్రాజెక్టు కాల్వ భూనిర్వాసితులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించగా.. వారి సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్ను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఏవో బాబూరావు, డీఎస్వో త్రినాథ్బాబు, తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్, ఏవో చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీవో మహాలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.