అశ్వారావుపేట, ఏప్రిల్ 29: ధాన్యం తరుగు ఇవ్వండి.. లేదంటే బయటి మార్కెట్లో అమ్ముకోండి.. అని ఉచిత సలహా ఇవ్వడంతో అసహనానికి గురైన రైతులు సదరు అధికారిని నిలదీశారు. ఈ ఘటన అశ్వారావుపేటలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో ధాన్యం విక్రయానికి రైతులు 20 రోజులుగా రాశులు సిద్ధం చేశారు. అధికారులు కొద్ది రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఫొటోలు దిగి.. మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు.
ఈ క్రమంలో రైతులు ఆందోళనకు సిద్ధమవుతుండగా.. అశ్వారావుపేట సొసైటీ ప్రత్యేకాధికారి రాజశేఖరరెడ్డి బుధవారం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చారు. దీంతో ఆయన వద్దకు వెళ్లిన రైతులకు 5 కేజీల తరుగు ఇవ్వాలని, లేదంటే బయట మార్కెట్లో అమ్ముకోండి అంటూ హుకుం జారీ చేశారు. అప్పటికే అసహనంతో ఉన్న రైతులు ఒక్కసారిగా సదరు అధికారిపై తిరగబడ్డారు. 20 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకుండా.. ఇప్పుడు వచ్చి తరుగు ఎలా తీయమంటారు అని నిలదీశారు.
రైతుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో సమాచారం అందుకున్న అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేశ్ అక్కడకు చేరుకున్నారు. రైతుల సమస్యలు విన్న ఆయన అదనపు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. గత ఏడాది ధాన్యం ఎలా సేకరించారో అలాగే తీసుకోవాలని సూచించారు. దీంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.