చింతకాని, మే 22 : కల్లాల్లో కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను 55 రోజులు దాటినా ఇంకా తరలించడం లేదని ఆరోపిస్తూ రైతులు చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు శుక్రవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కల్లాల్లో కాంటాలు వేసి 55 దాటినా బస్తాలను ఇంకా తరలించడం లేదని, కొందరు అధికారులు అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు కొమ్ముకాస్తూ వారు చెప్పిన వారికే లారీలను పంపిస్తున్నారని ఆరోపించారు.
ట్రక్ షీట్లు ఇవ్వకుండా మిగిలిన రైతులను సొసైటీ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటాలు వేసి ఇన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నా ఇటు ప్రభుత్వం, అటు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి సరుకును తరలించేందుకు లారీలను పంపించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.