కూసుమంచి, జూలై 4 : వరిసాగులో ఇప్పుడు బురద పొలాలు, నారుమడులు, నాట్లు లేవు.. నేరుగా విత్తనాలు ఎదపెట్టే పద్ధతి వచ్చేసింది. ఈ విధానం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడ్ పద్ధతి వంటివి అమలు అవుతున్నాయి. సరికొత్తగా ఈ ఆధునిక పద్ధతిని అవలంబించడంతో చాలామంది రైతులకు ఖర్చు తగ్గడంతోపాటు మంచి దిగుబడి వచ్చింది. వర్షాభావ పరిస్థితుల్లో మిషన్ ద్వారా నేరుగా విత్తనాలు నాటే విధానంతో రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఆదా అవుతున్నది. కూలీల సమస్యలు తీరిపోతున్నాయి. పొడి దుక్కిలో పెసర, కంది, వేరుశనగ ఎలా ఎద పెడతారో అలానే వరి విత్తనాలు కూడా ఎద పెడుతున్నారు. సీడ్ కం ఫెర్టిలైజర్ మిషన్తో సాగు చేస్తూ రైతులు మంచి దిగబడి సాధిస్తున్నారు. జిల్లాలో సాగర్ ఆయకట్టు మినహా అన్ని ప్రాంతాల్లో వరిసాగుకు రైతులు సిద్ధమయ్యారు. బావులు, బోర్లలో నీరు ఉండడంతో సాగుకు తయారయ్యారు. వ్యవసాయశాఖ అధికారులు రెండు సంవత్సరాలుగా వరి విత్తనాలు నేరుగా వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పలువురు రైతులకు తెలియజేసి విజయం సాధించారు.
ఎద పెట్టే విధానం…
వరి విత్తనాలను ఎద పెట్టే విధానంలో పొలాలను కరిగట్టు చేయనవసరం లేదు. నీరు అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న దుక్కులను దున్నుకొని నేరుగా విత్తనాలు ఎద పెట్టడమే. గత సంవత్సరం ఈ విధానంలో రైతులు ఎకరాకు రూ.10 వేల పైన ఆదా చేసుకోగలిగారు. నారుమడుల గోల లేదు. నాట్లు వేసే పని లేకుండా పోయింది. కూలీల ఖర్చు తగ్గడంతోపాటు సమయం కలిసివస్తున్నది. ప్రధానంగా పంట 20 రోజుల ముందుగానే చేతికి వస్తున్నది.
సీడ్ కం ఫెర్టిలైజర్ మిషన్..
ముదిగొండ మండలం మాధాపురంలో రామారావు అనే రైతు మూడేండ్ల కిందట ఈ సీడ్ కం ఫెర్టిలైజర్ మిషన్ను రూ.70 వేలకు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం దీని ధర రూ.లక్ష పైనే ఉన్నది. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా వ్యయసాయం చేయడానికి ఆలోచన చేసి మిషన్ కొన్నాడు. సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూనే మిషన్ను బాడుగలకు వాడుతున్నాడు. మాధాపురంలో రామారావుతోపాటు 10మంది రైతులు గత సంవత్సరం ఈ విధానంలో వరి సాగు చేసి ఎకరాకు 34 నుంచి 38 బస్తాలు పండించారు. ప్రస్తుతం వీరి బాటలో మరి కొంతమంది ప్రయాణిస్తున్నారు. కొత్తగా కూసుమంచి మండలం కేశ్వాపురంలో ఈ పద్ధతిలో వరిసాగు చేపట్టారు. కట్టా అనిల్ రెండు ఎకరాలు, కట్టా భీష్మ ఐదెకరాలు, తాళ్లూరి లక్ష్మీనర్సింహారావు నాలుగెకరాలు, పోటు గణపతి రెండెకరాలు, పోటు సత్యనారాయణ ఎకరం సాగు చేశారు.
అవగాహన కల్పిస్తున్న అధికారులు
కూసుమంచిలో వరి విత్తనాలను ఎద పెట్టే విధానాన్ని మండల వ్యవసాయశాఖ అధికారి రామడుగు వాణి పరిశీలించి రైతులకు మరింత అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక పద్ధతిలో వరినాట్లు వేసే విధానాలను ఏడీఏ విజయ్చంద్ర, ఏవో వాణి గ్రామాల్లో పర్యటిస్తూ వివరిస్తున్నారు.
ఎకరాకు రూ.2 వేలు తీసుకుంటున్నా..
మాది మాధాపురం. కూలీలతో ఇబ్బందులు పడలేక సీడ్ కం ఫెర్టిలైజర్ మిషన్ను కొన్నా. నాకు వ్యవసాయంలో సాయపడుతున్నది. బాడుగలకు కూడా పోతున్నాను. ఎకరాకు రూ.2 వేలతో పొడి దుక్కిలో విత్తనాలు పెడుతున్నా. కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి ,బోనకల్లు, చింతకానికి తదితర మండలాల్లో చాలా మంది రైతులు ఈ మిషన్తో వరి విత్తనాలు ఎద పెడుతున్నారు. పొడి దుక్కుల్లో విత్తనాలతోపాటు మందులు కూడా వేసుకోవచ్చు.
– రామారావు, మాధాపురం, మిషన్ యజమాని
కూలీల ఇబ్బందులు పోయాయి..
మాది కూసుమంచి మండలం కేశ్వాపురం. రెండున్నర ఎకరాల్లో మిషన్ ద్వారా వరి విత్తనాలు ఎద పెట్టాను. ఎకరాకు రూ.2 వేల ఖర్చు వచ్చింది. అదే పాత పద్ధతిలో అయితే ఎకరాకు 12వేల వరకు ఖర్చు వచ్చేది. కూలీలు, నారుమడులు, నాట్లు, బురద పొలాలు, కరిగట్టు.. ఈసారి ఇవేవీ లేవు. పెద్ద చికాకు తప్పింది. గత సంవత్సరం ఇలా వరి వేసిన రైతులతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా.
– కట్టా అనిల్, రైతు, కేశ్వాపురం
చాలా సమయం కలిసొస్తుంది..
ఈ పద్ధతిలో వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. సమయం చాలా కలిసివస్తుంది. సీడ్ కం ఫెర్టిలైజర్ మిషన్ ద్వారా పొడి దుక్కుల్లో వరి విత్తనాలు ఎద పెట్టడంతో రైతుకు ఎకరాకు రూ.10 వేల వరకు ఆదా అవుతుంది. పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. రైతులు కరి వెద, సీడ్ కం ఫెర్టిలైజర్ ద్వారా వరి సాగు చేసుకోవాలి. మిషన్తో మందులు కూడా వేసుకోవచ్చు.
– వాణి, ఏవో, కూసుమంచి