తిరుమలాయపాలెం/ వైరా టౌన్/ పెనుబల్లి ఏప్రిల్ 18 : ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులు చేతికొస్తున్న తరుణంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, తెలంగాణ రైతు సంఘం, రైతుల ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, కొణిజర్ల, పెనుబల్లి మండల కేంద్రాల్లో శనివారం ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
పెనుబల్లి తహసీల్, ఐకేపీ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. తహసీల్దార్ వీరభద్రనాయక్కు, ఐకేపీ ఏపీఎం కల్పనకు వినతిపత్రాలు అందజేశారు. కొణిజర్లలోని రాష్ట్రీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం గోపారం సొసైటీ కార్యాలయం వద్ద అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకుడు బిళ్లగిరి ధనుంజయ, తాళ్లచెరువు సర్పంచ్ గడిపుడి వెంకటనారాయణ, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు చిట్టిమోదు కృష్ణయ్య తదితరులు మాట్లాడారు. పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారని, కొందరు దళారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలో గన్నీ సంచులు, రైతులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
లేదంటే కేంద్రాలు ఏర్పాటు చేసే వరకు దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు చిర్రా కృష్ణయ్య, జక్కుల వీరన్న, కాంగ్రెస్ నాయకుడు దొడ్డా గురువయ్య, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు చలమాల విఠల్రావు, కార్మిక సంఘం నాయకులు గాయం తిరుపతిరావు, తాండ్ర రాజేశ్వరరావు, తడికమళ్ల చిరంజీవి, మల్లెల్లి శ్రీను, వంగా రాము తదితరులు పాల్గొన్నారు.