భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ఖమ్మం వ్యవసాయం, జూన్ 28 : రైతుబంధు సొమ్ము పంపిణీ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు రోజుల్లో మొత్తం 3,62,410 మంది రైతుల ఖాతాల్లో రూ.274.71కోట్లు జమ అయ్యాయి. మొదటి రోజు ఎకరం, రెండో రోజు ఎకరం భూమికిపైగా ఉన్న రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అయింది. దీంతో ఫోన్ మెసేజ్ మేరకు బ్యాంకులకు వెళ్లిన రైతులు సొమ్ము తీసుకుని సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు వినియోగిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో తొలిరోజు ఎకరంలోపు భూమి కలిగిన 1,18,126 మంది రైతులకు.. రూ.36.90కోట్లు, రెండో రోజు 1-2 ఎకరాలు భూమి కలిగిన 89,388 మంది రైతులకు.. రూ.95.50కోట్లు సంబంధిత రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. బుధవారం మూడో రోజు 2-3 ఎకరాలలోపు భూమి కలిగిన 40,635 మంది రైతులకు.. రూ.25కోట్లు జమ అయ్యాయి. మూడు రోజుల వ్యవధిలో ఖమ్మం జిల్లాలో 2,48,149 మంది రైతులకు.. రూ.157.10కోట్లు జమ అయ్యాయి. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే ముందస్తుగా సన్న, చిన్నకారు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూడు ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు పంటల పెట్టుబడి రంది తీరినైట్లెంది.
భద్రాద్రి జిల్లాలో&
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతోంది. తొలిరోజు 65,051 మంది రైతులకు.. రూ.36.69కోట్లు చెల్లింపులు జరగగా.. రెండో రోజు 20,816 మందికి.. రూ.40కోట్లు ట్రెజరీ ద్వారా వారి ఖాతాలకు వెళ్లాయి. మూడో రోజు 28,394 మంది రైతులకు.. రూ.40.92కోట్ల్లు ఖాతాల్లో జమ అయ్యాయి. మొత్తంమ్మీద మూడు రోజుల్లో 1,14,261 మందికి.. రూ.117.61కోట్లు జమ అయ్యాయి.
పెట్టుబడికి ఉపయోగపడింది..
రైతుబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించిన డబ్బులు పెట్టుబడికి చాలా ఉపయోగపడుతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం ఆనందంగా ఉంది. పెట్టుబడి అందడంతో వ్యవసాయ పనులు వేగవంతం చేశాం. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రైతుబంధు కింద సాయం చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– దొండపు వేణు, రైతు, రామాపురం గ్రామం, బోనకల్లు మండలం
విత్తనాలు కొనుగోలు చేస్తా..
ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం డబ్బులు నా ఖాతాలో జమ అయ్యాయి. ఈ డబ్బులతో విత్తనాలు కొనుగోలు చేస్తా. సీఎం కేసీఆర్ చెప్పినరోజే రైతుబంధు డబ్బులు వేయడం ఆనందంగా ఉంది. ఈసారి కాస్త ముందుగానే డబ్బులొచ్చాయి. ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా లాంటి ఎన్నో పథకాలు అమలుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నది. సరిగ్గా వర్షాలు పడే సమయంలో రైతుబంధు అందడం పెట్టుబడికి సాయంగా నిలిచింది.
– పల్లెపొంగు బాబూరావు, రైతు, న్యూ లక్ష్మీపురం గ్రామం, ముదిగొండ మండలం
అప్పు చేసే బాధ తప్పింది..
తెలంగాణ ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం సన్న, చిన్నకారు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది. నాకు రైతుబంధు సాయం అందింది. వర్షాలు కాస్త ఆలస్యం కావడంతో ఇప్పుడే వ్యవసాయ పనులు మొదలుపెట్టాం. సరైన సమయంలో రైతుబంధు డబ్బులొచ్చి ఎంతో ఉపయోగపడ్డాయి. ఐదేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం మాకు ఎంతో ఆసరాగా ఉంది. రైతుబంధు లేకపోతే అప్పు చేసేవాడిని.
– సామినేని రమేశ్, రైతు, చిరుమర్రి గ్రామం, ముదిగొండ మండలం
ఫోన్కు మెసేజ్ వచ్చింది
నాకు ఎకరం పొలం ఉంది. రైతుబంధు సాయం ఈరోజు బ్యాంకులో పడినట్టు నా ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం సమయానికి పెట్టుబడి సాయం అందించింది. ఆ డబ్బులు పంట సాగుకు ఉపయోగపడుతున్నాయి. వారం నుంచి పొలాన్ని దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటున్నాను. సీఎం కేసీఆర్ అన్నమాట నిలబెట్టుకుంటారు. అందుకే అదునుకు సొమ్ములు వేశారు. ముందుగానే డబ్బులు వేయడం చాలా ఆనందంగా ఉంది.
– అంచె కృష్ణ, తిప్పనపల్లి, చండ్రుగొండ మండలం