సత్తుపల్లి/ సారపాక, డిసెంబర్ 10 : రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో వరినారుకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంట పొందవచ్చని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈసారి వానకాలం కంటే యాసంగిలో రైతులు వరిపంటను అధికంగా సాగుచేసే అవకాశం ఉంది. ఈక్రమంలో లైసెన్సు కలిగిన దుకాణాల నుంచే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి రశీదును భద్రపర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనాలు మొలకెత్తకుంటే దుకాణదారుడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
నారుపోసిన నాలుగైదు రోజుల తర్వాత కిలో యూరియా, రెండు కిలోల డీఏపీ, కిలో పొటాషియం చల్లాలి.
చలి తీవ్రతతో నారుమడి ఎరుపురంగులోకి మారి చనిపోతుంది. దీని నివారణకు రెండు గ్రాముల జింకు సల్ఫేట్ను లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి.
నారుమడిలో ఆకుపచ్చ తెగులు కనిపిస్తే కార్బండిజం 1.5గ్రాములును లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. మళ్లీ నాలుగైదు రోజుల వ్యవధిలో నారుమడి ఎరుపురంగులో ఫార్ములా-4, 5, రెండుసార్లు పిచికారీ చేయాలి. దీంతో సూక్ష్మధాతు లోపాలనునివారించవచ్చు.
వరిపై కాండంతొలుచు పురుగు ప్రభావం ఉంటుంది. నారుమడి వేసిన 15 రోజులకొకసారి కిలో కార్పోఫ్యూరాన్ 3జీ గుళికలను చల్లాలి. రెండోవిడతగా నాటువేసే వారం ముందు మరోసారి చల్లాలి.
సేంద్రియ పద్ధతిలో విత్తనశుద్ధి 5 గ్రాముల సూడోమోనాస్ పొడిని కిలో విత్తనానికి ఒక లీటరు చొప్పున కలుపుతూ 30 కిలోల విత్తనాలకు సరిపడే ద్రావణాన్ని తయారుచేయాలి. ఈ ద్రావణంలో విత్తనాలను 12 నుంచి 24గంటల పాటు నానబెట్టాలి.
ఒకవేళ విత్తనాలు వేయదలిస్తే మొలకశాతం పెరగడానికి నత్రిక్ఆమ్లం 30మిల్లీలీటర్లను 50లీటర్ల నీటిలో కలిపి 12 గంటలు నానబెట్టాలి.
ఈసీజన్లో చలితీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి మామూలు విధానం కంటే పొలంలో 10సెంటీమీటర్ల ఎత్తులో బెడ్ను ఏర్పాటు చేసి నారుపోయాలి. దీంతో చలినుంచి కొంత రక్షణ ఉంటుంది.
రసాయనాలతో విత్తనశుద్ధి తడిపద్ధతి విధానంలో లీటరు నీటికి 1.5 గ్రాముల కార్బండిజం పొడిని కలిపి 30 కిలోలకు సరిపడా ద్రావణం తయారుచేసుకోవాలి. ఆ ద్రావణంలో 12 నుంచి 24 గంటల వరకు విత్తనాలు నానబెట్టాలి.
పొడి విధానంలో మూడు గ్రాముల కార్భండిజం పొడిని కిలో విత్తనానికి బాగా పట్టించి చల్లుకోవాలి.
25 నుంచి 30 రోజుల నారును మాత్రమే నాటుకోవాలి.
నాటువేసే సమయంలో నారు చివరి ఆకులను తుంపి నాటితే మంచిది
నాటువేసే ముందు క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలోకి కలిపి 50లీటర్ల ద్రావణాన్ని తయారుచేసుకోవాలి. ఈ ద్రావణంలో నారును నానబెట్టి నాటుకున్నట్లయితే రసం పీల్చేపురుగును అరికట్టవచ్చు.
చలినుంచి కాపాడేందుకు…
రాత్రివేళల్లో నారుమడిలో నీటిని తీసివేసి ఉదయాన్నే వెచ్చని బోరునీటిని పెట్టాలి.
ఎత్తైన నారుమడిపైనే నారును పెంచాలి.
మంచు ప్రభావంతో నారుమడి చనిపోతుంది.. కావున నారుమడి చుట్టూ కొంత ఎత్తులో కట్టెలను కట్టి వాటిపై పాత బట్టలు కానీ… పాలిథిన్ కవర్లు కానీ కప్పాలి.
సూక్ష్మపోషకాల నివారణకు జింక్ సల్ఫేట్ ఫార్ములా-4, 5లను పిచికారీ చేయాలి. పై జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యకరమైన నారుమడితో అధిక దిగుబడులు సాధించవచ్చు.
యాసంగికి వరినార్లు పోసుకునే రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున వ్యవసాయశాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. విత్తనం మొలకెత్తే దశలో తెగుళ్లు సోకే అవకాశం ఉంటుంది. లైసెన్స్ కలిగిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రశీదులను భద్రపర్చుకోవాలి.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నారుమడుల్లో సాయంత్రం వేసిన నీటిని ఉదయం తొలగించాలి. రైతులు చలితీవ్రత నుంచి నారుమడిని కాపాడుకోవడానికి వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే మంచిది. నారుమడికి అవసరమైన వెచ్చదనం అందించే ఎరువులను వాడుకుంటే ఫలితం ఉంటుంది. నారుమడులకు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం.