ధరణి పోర్టల్ చాలా బాగుంది.. దళారులు లేరు.. ఎక్కడా లంచాలు లేవు.. వ్యవసాయ భూముల రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రంగా ఉన్నాయి.. రైతులు ఎప్పుడంటే అప్పుడు తమ భూమికి సంబంధించిన వివరాలు చూసుకునే అవకాశం ఉంది. తమ ప్రమేయం లేనిదే రికార్డుల్లో మార్పులు జరుగవనే గట్టి నమ్మకమూ ఉంది. భూములు కొనాలన్నా, అమ్మాలన్నా రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుడు తిప్పలు అసలే లేవు. కోరుకున్న సమయంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేసారి జరిగిపోతున్నవి. కొద్దిరోజుల్లోనే పోస్టులో ఇంటి వద్దకే పాస్ పుస్తకాలు వస్తున్నాయి. పాస్బుక్కులు ఉండడంతో ప్రభుత్వ పథకాల ఫలాలన్నీ ఠంచన్గా అందుతున్నాయి. గతంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేది. అప్పటి పరిస్థితిని.. ఇప్పటి పరిస్థితిని చూసిన రైతులు ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. ‘ధరణి’ని చూసుకొని ధీమాతో మురిసిపోతున్నారు. అయితే కాంగ్రేసోళ్ల మాటలు విని కలవరపడుతున్నారు. ధరణిని తీసేస్తామంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరణి చాలా బాగుందని.. ధరణి ఉండాల్సిందేనని ముక్తకంఠంతో కోరుతున్నారు.
– నమస్తే నెట్వర్క్
గట్టుకు హద్దురాళ్లు, రాళ్లకు సున్నం గుర్తులు ఉండనే ఉంటాయి.. కానీ ఆ భూమి సర్వేనెంబర్ మాత్రం వేరే రైతు పాసుబుక్క్లో ఉంటది. తండ్రి పొలం కొడుకులందరికీ సమాన వాటా రావాలి కానీ ఆ కుటుంబంలో తెలివైన కొడుకు పాస్బుక్లో మాత్రం ఎక్కువ భూమి ఉంటది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు గత ప్రభుత్వాల హయాంలో రైతులను పట్టిపీడించేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే రైతుల కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తొలిగిపోయాయి. ప్రధానంగా భూ సమస్యలన్నింటికీ ‘ధరణి’ పోర్టల్ ఒక్కటే సమాధానంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచనాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణితో రైతన్నలు సంతోషంగా ఉన్నారు.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటూ చెబుతుండడంతో రైతన్నల్లో కలవరం మొదలైంది. ధరణి ఉండాల్సిందేనంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
– నమస్తే నెట్వర్క్
ధరణి లేకపోతే అథోగతి పాలే..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ధరణిని తీసేస్తే రైతుల పరిస్థితి అథోగతి పాలే. నాడు భూముల పంచాయితీలతో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. వీటన్నింటి నుంచి విముక్తి పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేసి భూముల పరిరక్షణ కోసం ధరణిని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. రైతుల పాలిట దేవుడు కేసీఆర్.
– దొడ్డపునేని శ్రీదేవి, కొత్తకారాయగూడెం సర్పంచ్, పెనుబల్లి మండలం
ధరణిని తీసేయడం అవివేకం..
వందేళ్లుగా ఇబ్బంది పడుతున్న భూముల సమస్యలు నేడు ధరణితోనే పరిష్కారమయ్యాయి. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ మా కోసం చేసిన గొప్ప పని. తాళ్లపెంట రెవెన్యూ పరిధిలో రైతులకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ధరణి రూపంలో కేసీఆర్ దేవుడిలా పరిష్కరించారు. ధరణి లేకుంటే వందేళ్ల నాటి సమస్య కూడా నేటికీ పరిష్కారమయ్యేది కాదు. ధరణియే ఎప్పటికీ అవసరం. ధరణి పోర్టల్ను కాంగ్రెసోళ్లు తీసేస్తామనడం వారి అవివేకం.
– రాయపూడి మల్లయ్య, కర్రాలపాడు సర్పంచ్, పెనుబల్లి మండలం
ధరణి లేకుంటే రైతులకు జగడాలే..
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లే చెయ్యి తడపనిదే పనిచేసే వాళ్లుకాదు. ఒకరి సర్వే నెంబర్ ఇంకొకరికి ఎక్కించే వాళ్లు. మన పొలం మనకు చూపించాలంటే సర్వేయర్ రావాలని ఏళ్ల తరబడి తిప్పడం ఉండేది. చివరికి పొలం ఉన్నచోట సర్వే నెంబర్ ఉండేది కాదు. ఇలాంటి వ్యవస్థ అప్పుడు ఉండేది. డబ్బు ఉన్నోడిదే రాజ్యం అయ్యేది. ధరణి వచ్చేక చాలా మార్పులు వచ్చాయి. మన పొలం పక్కాగా మనకే ఉంటది. ఫోన్లో కొట్టినా మన నెంబర్ కనబడేలా చేశారు. ఇలాంటి ధరణిని తీసేస్తే రైతులకు మళ్లీ జగడాలు తప్పవు.
– వడ్డే అంజయ్య, రావులపాడు, టేకులపల్లి మండలం
మోసాలకు తావులేదు..
వీఆర్వోలు రాత్రికి రాత్రే పాసుబుక్కులు పేర్లు మార్చి తెల్లవారేసరికి కొత్త పుస్తకాలు ఇచ్చేవాళ్లు. ఇలాంటి వ్యవస్థను మళ్లీ ఎందుకు కోరుకుంటారు. అప్పుడు పాసుపుస్తకంలో సర్వే నెంబర్ ఉన్నా ఎప్పుడు మారి పోతుందో తెలిసేది కాదు. పెద్దోళ్ల చేతుల్లో పాసుపుస్తకాలు ఉండేవి. డబ్బుల్లేక రైతులు పాసుపుస్తకాలు తాకట్టు పెడితే ఆ పుస్తకాల్లో ఉన్న భూమిని మార్చుకునే వాళ్లు డబ్బున్న ఆసాములు. ఇప్పుడు ధరణిలో అలాంటి మార్పులకు, మోసాలకు తావులేకుండా పోయింది. అందుకే సీఎం కేసీఆర్ మంచిగా ధరణిని పెట్టారు. ఇలాంటివే ఉండాలి. ఎలాంటి భయం ఉండదు.
-జడ వెంకయ్య, దామరచర్ల, చండ్రుగొండ
ధరణితోనే రైతులకు మేలు
తెలంగాణ ప్రారంభించిన ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులు, దళారులకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. నేడు ఆ పరిస్థితి లేకుండా మీ సేవాలో స్లాట్బుక్ చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం, పట్టాదార్ పాస్బుక్ చేతికి అందిస్తున్నారు. ధరణి ద్వారా క్రయవిక్రయాలకు రైతులకు ఇబ్బంది తప్పింది. గ్రామాల్లో భూ తగాదాలు బాగా తగ్గాయి. ధరణిని తీసేస్తే మళ్లీ భూ గొడవలు పెచ్చురిల్లుతాయి.
– కంచర్ల రమాదేవి, కాకర్లపల్లి సర్పంచ్, సత్తుపల్లి మండలం
ధరణితో రైతులకు ధీమా
ధరణి పోర్టల్ ద్వారా భూ క్రయ, విక్రయదారులకు ఇబ్బందులు తప్పాయి. గతంలో దళారులను పట్టుకుని సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. నేడు తహసీల్దార్ కార్యాలయంలోనే నేరుగా రిజిస్ట్రేషన్ చేసి వెంటనే పాస్బుక్ అందజేస్తున్నారు. మరోపక్క ఒకరి భూమి ఒకరికి మారకుండా వేలిముద్రల ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోంది. ధరణి వచ్చాక రైతులకు ధీమా కలిగింది.
– కారం జయేందర్రావు, బుగ్గపాడు సర్పంచ్, సత్తుపల్లి మండలం
ధరణిని ఎత్తేస్తే దళారీలదే రాజ్యం
ధరణి రైతులకు చాలా మేలు చేస్తున్నది. ఇది తీసేస్తే మళ్లీ దళారీలదే రాజ్యమవుతుంది. రైతులకు మళ్లీ కష్టాలు తప్పవు. చేర్పులు మార్పులు చేతిరాతతోనే ఉంటాయి. కంప్యూటర్ ఉండదు. రాత్రికి రాత్రే చేతితో రాసి పాసుపుస్తకాలు ఇచ్చేస్తారు. ధరణి తీస్తే ఒప్పుకోం. ఒక్కసారి ధరణిలో మన పేరు ఎక్కితే చాలు రైతులకు రావాల్సిన పథకాలు అన్నీ ఈ నెంబర్ వల్లే వస్తాయి. గతంలో జరిగిన తప్పిదాలు వల్ల రైతులు చాలామంది నష్టపోయారు. తలలు పగలుగొట్టుకున్నారు.
– మట్ట జానకయ్య, కాసినగరం, దుమ్ముగూడెం మండలం
ధరణిని రద్దు చేస్తే రైతులకు తీవ్రనష్టం
ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలిగింది. ధరణిని రద్దు చేస్తామని చెప్పడం రైతులకు అన్యాయం చేయడమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్ను రద్దు చేస్తే రైతులకు తీవ్రనష్టం కలుగుతుంది. బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలకు అనేక ప్రయోజనాలు చేకూరాయి. కాంగ్రెస్ హయాంలో రైతుల భూములపై శ్రద్ధ చూపకపోవడంతో అనేకవిధాలుగా నష్టపోయారు. పహణీల్లో భూములు నమోదై ఏళ్లు గడిచినా పట్టాదారు పాస్పుస్తకాలు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతుకూ భూమిహక్కు కల్పిస్తూ పట్టాదారు పాస్పుస్తకాలు అందాయి. రూపాయి ఖర్చు లేకుండా పట్టాదారు పాస్పుస్తకాలు అందించిన ఘనత కేసీఆర్కే దక్కింది. రైతులతో రాజకీయాలు చేయడం కాంగ్రెస్ నాయకులకు మంచిపద్ధతి కాదు.
– కొమ్మినేని ఉపేందర్, రావినూతల సర్పంచ్, బోనకల్లు మండలం
16ఏండ్ల సమస్య ధరణితో తీరింది…
గతంలో నైజాం ప్రభుత్వానికి చెందిన భూములను పలువురు ఆక్షన్లో కొనుగోలు చేయగా వారి వద్ద నుంచి 2006లో మా గ్రామానికి చెందిన రైతులం కొనుగోలు చేశాం. 2006లో దాదాపు 30 ఎకరాల భూమిని 15మంది రైతులు కొనుక్కున్నాం. ధరణి రాకముందు వరకు వాటిని మేము సాగు చేసుకుంటున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో పీవోబీ కింద ఉండి మాకు హక్కు లభించలేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో తమ భూముల సమస్యను కలెక్టర్ దృష్టికి, సీసీఎల్ఏ దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో మాలాగా అనేక మంది రైతులు ఉన్నట్లు తెలుసుకున్న సీఎం కేసీఆర్ ధరణిలో మార్పులు చేయించి మా భూములపై మాకు హక్కు కల్పించారు. పదహారు సంవత్సరాలుగా ఉన్న మా భూమి సమస్యకు గత ఏడాది ధరణిలో చేసిన మార్పుతో మాకు ఇబ్బందులు తొలిగిపోయాయి. రైతులందరం చాలా సంతోషంగా ఉన్నాం. పని వదులుకుని రెవెన్యూ కార్యాలయం చుట్టు తిరిగే పని లేకుండా ధరణితో మా సమస్య తీరింది.
– అవినేని శేషయ్య, రైతు, ఆరెగూడెం, నేలకొండపల్లి మండలం
పంటపొలాల పక్కా అడ్రస్ ‘ధరణి’
పొలం తగాదాలతో తండ్రీకొడుకులు, అన్నాదమ్ములు హత్యలు చేసుకున్న సంఘటలను కళ్లారా చూసాం. భూముల సమస్యలకు సీఎం కేసీఆర్ చక్కటి పరిష్కారం చూపారు. ధరణి ద్వారా ఎన్నో సంస్కరణలతో మార్పులు వచ్చాయి. తరతరాలుగా పెద్దకుటుంబాల ఏలుబడిలో ఉన్న భూములు అసలైన రైతులకు దక్కడంలో ధరణి పోర్టల్ బాగా ఉపయోగపడింది. ధరణి వచ్చాక భూమి సమస్యలకు శాస్వత పరిష్కారం లభించింది. ఒక్క క్లిక్తో పొలం అంతా హద్దులతో గూగుల్లో చూపే అతిపెద్ద భూసంస్కరణలకు పెద్దపీట వేసిన ధరణి రైతుల పాలిట వరంగా మారింది. 2020లో ప్రారంభించిన ధరణి వెబ్సైట్ రైతుల పంటపొలాలకు పక్కా అడ్రస్ చూపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం అంటున్నారు. రైతులంతా ముక్తకంఠంతో ధరణి ఉండాలంటున్నారు. రైతులందరూ కాంగ్రెసోళ్లను వ్యతిరేకిస్తున్నారు.
– మండే వీరహనుమంతురావు, సొసైటీ చైర్మన్, కొత్తగూడెం