ఖమ్మం : రైతుబంధు పథకం..అన్నదాతల్లో మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.ఖాతాల్లోకి డబ్బులు చేరిన వేళ రైతన్నలు సంబురాలు జరుపుకుంటున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ సర్కార్ రైతుబంధు డబ్బులు ఖాతాల్లోకి జమ చేస్తుండటంతో పల్లెల్లో కర్షకులు మురిసిపోతున్నారు. యాసంగి సాగుకు అవసరమైన పంట పెట్టుబడి సాయాన్ని అందించినందుకు సీఎం యకేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. గతంలో సీజన్కు ముందు వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలుకు అప్పులు చేయాల్సి వచ్చేదని..తెలంగాణ సర్కార్ వచ్చినంక ఊర్లో అప్పులు చేయాల్సిన అవసరం లేదని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎకరానికి రూ.5వేలు చొప్పున ప్రభుత్వమే పంట పెట్టుబడికి ఆర్ధిక సాయం చేస్తోందని..గత పాలకులు వ్యవసాయ రంగాన్ని విస్మరించి రైతులకు తీవ్ర అన్నాయం చేశారని రైతులు మండిపడ్డారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి ఏడాది రెండు దఫాలుగా పంట పెట్టుబడికి ఆర్ధిక సాయం చేస్తున్నారన్నారు. ఈ మేరకు బుధవారం రఘునాథపాలెం ఆత్మకమిటీ ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని కొనియాడారు.
ఆత్మచైర్మన్ బుక్యా లక్ష్మణ్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మందడపు సుధాకర్, టీఆర్ఎస్ పార్టీ ఎస్టీసెల్ మండలాధ్యక్షుడు ధరావత్ రామ్మూర్తి నాయక్, మంచుకొండ ఉపసర్పంచ్ తేజావత్ రమేష్, టీఆర్ఎస్ నాయకులు బోడా సైదులు, బోడా భాస్కర్, రాజా నాయక్ తదితరులు పాల్గొన్నారు.