DG Vikram Singh Mann | హైదరాబాద్, జూలై 30 : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, మరోవైపు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. వర్షాకాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్ గురువారం రాష్ట్రంలోని 33 జిల్లాల జిల్లా అగ్నిమాపక అధికారులు, అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారులు, స్టేషన్ ఫైర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్లో భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న జిల్లాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లాలో రెస్క్యూ బృందాల సిద్ధత, పడవలు, డీ-వాటరింగ్ పంపులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర అత్యవసర పరికరాల అందుబాటు, వాటి పనితీరును వివరంగా పరిశీలించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించేలా అన్ని అగ్నిమాపక కేంద్రాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సమన్వయమే విజయానికి కీలకం..
విపత్తు సమయంలో ముందస్తు సన్నద్ధత, వేగవంతమైన స్పందనే ప్రాణనష్టాన్ని తగ్గిస్తుందని డీజీ విక్రమ్ సింగ్ మాన్ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే రెండు దఫాలుగా నిర్వహించిన వరదల మాక్ డ్రిల్స్ ద్వారా వచ్చిన అనుభవాలను క్షేత్రస్థాయిలో వినియోగించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో సమన్వయం మరింత బలోపేతం చేసి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుత వర్షాకాలంలో అధికారులు నిరంతరం వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో శాఖ డైరెక్టర్, అదనపు డైరెక్టర్, ఆర్ఎఫ్ఓ–ఎమ్జెడ్–II తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Municipal Commissioner | భద్రకాళి బండ్పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్
Punjab Paper Leaks | పంజాబ్లో వరుస పేపర్ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు