బోనకల్లు :బాలీవుడ్ నటుడు సోనుసూద్ చేసిన సేవలకు ఆకర్శితుడైన ఓ కూలి విగ్రహాన్ని కట్టించి, ఫ్లెక్సి ఏర్పాటు చేశాడు. దానిపై కలియుగ కర్ణుడు, పేదల దేవుడు అని రాసాడు.ఈ సంఘటన బోనకల్లు మండలంలోని గార్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గార్లపాడు హరిజనకాలనీకి చెందిన గుర్రాల వెంకటేశ్వర్లు కూలి పనులు చేస్తూ, వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. అటువంటి వెంకటేశ్వర్లు సోనూ సూద్ పై అభిమానం పెంచుకున్నాడు.విజయవాడలో సోనుసూద్ విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహాన్ని గార్లపాడు గ్రామంలో ప్రతిష్టించాడు.
ఈ విగ్రహానికి చుట్టూ పిల్లర్లు వేసి విగ్రహం వర్షానికి తడవకుండా రేకులతో కప్పు కూడా నిర్మించాడు. దేశంలో కరోనా వచ్చిన సమయంలో అనేక మంది పేదలను ఆయన ఆదుకున్నాడన్నారు గుర్రాల వెంకటేశ్వర్లు. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ఆయన అభిమానిగా తనవంతు బాధ్యతగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి సోనూసూద్ సేవలను పదిమందికి తెలియజేస్తున్నానని తెలిపాడు. విగ్రహం ప్రతిష్టించక ముందు తాను స్వయంగా ఇంట్లో పెట్టుకొని పూజలు చేశాడు.