ఖమ్మం రూరల్, జనవరి 1 : నలభై ఏండ్ల రాజకీయ జీవితం ఎంతో సంతృప్తి కలిగించిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తుమ్మల అనుచరులు బారుగూడెం గ్రామ పరిధిలోని శ్రీసిటీలో తుమ్మల స్వగృహం వద్ద ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. పాలేరు ప్రజలతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు తమ్మల నాగేశ్వరరావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. పార్టీ నాయకుడు సాధు రమేశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు, బోనాలతో వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
నలభై ఏండ్ల తమ్మల రాజకీయ జీవితంలో జిల్లా అభివృద్ధికి కృషి చేసిన పలు నిర్మాణాలు, ఇతర పథకాలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాన్ని తుమ్మల ఆవిష్కరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తుమ్మల రూరల్ మండలంలో సొంతగృహం ఏర్పాటు చేసుకోవడం గంటలపాటు ఎంతో ఓపికతో కార్యకర్తలను కలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అనంతరం విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ ముగ్గురు సీఎం వద్ద మంత్రిగా పనిచేశానని, ఈ అవకాశం కల్పించిన జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పది లక్షల ఎకరాల్లో పసిడి పంటలు కళకళలాడాలన్నదే తన తపన అన్నారు. గోదావరి జలాలను పాలేరు ప్రజల దరిచేర్చి వారి పాదాలను కడగడమే ప్రధాన ధ్యేయమన్నారు. సీఎం కేసీఆర్ తోడ్పాటుతో ఈ ప్రయత్నం ఫలించబోతుందన్నారు.
సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారంతోనే జిల్లాలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. పల్లెపల్లెకూ రహదారులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. తుమ్మలకు అభినందనలు తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, తుమ్మల యుగంధర్, శ్రీసిటీ అధినేత గరికపాటి వెంకట్రావ్, ఆంజనేయ ప్రసాద్, సీఈవో విజయ్, ఖమ్మం వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, కమిటీ నాయకులు, కార్పొరేటర్ తోట రామారావు, బీఆర్ఎస్ నాయకులు జొన్నలగడ్డ రవి, బండి జగదీశ్, మద్ది మల్లారెడ్డి, తుపాకుల యలగొండస్వామి, తోట వీరభద్రం, ఆయా నియోజకవర్గాల నాయకులు, ప్రజాప్రతినిధిలు పాల్గొన్నారు.