భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 5 లోపు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఏర్పాటు ప్రక్రియపై ప్రతిరోజు నివేదికలు అందజేయాలన్నారు.
26, 27 తేదీలతో పాటు వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా 110 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 71 మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఆర్డీవో మధుసూదన్ రాజు, డీఆర్వో అశోక్ చక్రవర్తి, డీపీవో రమాకాంత్, ఆర్డీవోలు స్వర్ణలత, రత్నకుమారి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి అన్నిజిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నిర్మాణం పూర్తయిన చోట లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలన్నారు. సమావేశంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇండ్ల నిర్మాణాలను వేగిరం చేస్తామన్నారు.