మామిళ్లగూడెం, జనవరి 9 : ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ ప్రక్రియ పర్యవేక్షణను ప్రత్యేక అధికారులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ప్రత్యేక అధికారులతో డాటా నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు 100శాతం, టీమ్ లీడర్లు 5శాతం, మండల ప్రత్యేక అధికారులు 1శాతం దరఖాస్తుల పరిశీలన చేయాలన్నారు.
ఆధార్, రేషన్ కార్డుల నెంబర్లు సరి చూడాలన్నారు. గుర్తించిన పొరపాట్లకు నివేదిక సమర్పించాలన్నారు. ఎకువ పొరపాట్లు చేసిన డాటా ఎంట్రీ ఆపరేటర్లను మార్చాలన్నారు. సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు జి. గణేశ్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, అధికారులు పాల్గొన్నారు.