సారపాక, ఫిబ్రవరి 11: గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా ఆంగ్ల బోధన చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం సారపాకలోని బీపీఎల్ స్కూల్లో ఉమ్మడి జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ లెక్చరర్లతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇంగ్లిష్లో విద్యాబోధన, మాట్లాడుకునే విధానం, నైపుణ్యాల గురించి అర్థం చేసుకుని గిరిజన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.
వారానికి 20 మంది చొప్పున ఎంపిక చేసి నిష్ణాతులైన ఇంగ్లిష్ లెక్చరర్లతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని అన్నారు. ప్రతి ఆదివారం ఇంగ్లిష్ పాఠశాలలుగా కన్వర్ట్ చేసిన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆంగ్ల భాషపై మక్కువ కలిగేలా చేస్తామన్నారు. పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి తమవంతు బాధ్యతగా కృషిచేస్తున్న ప్రిన్సిపాల్, లెక్చరర్లను పీవో ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో భద్రాచలం, ఖమ్మం ఏసీఎంవోలు రమణయ్య, నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.