ఖమ్మం, జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలను విజయవంతంగా అమలు చేసేందకు ప్రణాళికలు కొనసాగుతున్నాయన్నారు. ఖమ్మం లో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీస్సులతో విజయం సాధించాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రోజే ప్రజలకు ఇచ్చిన హామీల్లో ముందుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే కార్యక్రమాన్ని అమలు చేశామని అన్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించి వాటికి చట్టబద్దత కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేశామని, వాటి అమలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్ని అడ్డుంకులు వచ్చినా 24 గంటల కరెంట్ ఇచ్చి తీరుతామని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులందరికీ పథకాలను అందిస్తామని అన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకూ స్థలం మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన అందించి అభివృద్ధి, సంక్షేమంతో ముందుకెళ్తామని అన్నారు.