మామిళ్లగూడెం/ కొత్తగూడెం టౌన్, డిసెంబర్11: రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒకరికీ ఓటు హక్కు కల్పించి, ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వచ్చే నెల 1 వరకు 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటరు కార్డు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ -2024కు ముందు ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,450 కంటే ఎకువ ఓటర్లు ఉండకుండా చూడాలన్నారు. ఓటరు జాబితా నుంచి మరణించిన ఓటర్లను తీసివేయాలన్నారు. జనవరి 6న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాలన్నారు.
ఇదే నెల 22 వరకు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. ఫిబ్రవరి 2 లోపు అభ్యంతరాలను పరిష్కరించి 8న తుది ఓటరు జాబితా ప్రకటించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఓటర్ జాబితా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్నాయక్, ఆర్డీవోలు జి.గణేశ్, అశోక్చక్రవర్తి, జిల్లా ఉపాధికల్పన అధికారి కె.శ్రీరామ్, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సహాయ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, రూరల్ తహసీల్దార్ రామకృష్ణ, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు పాల్గొన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్ నుంచి భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ఎలక్షన్ తహసీల్దార్ రంగాప్రసాద్ పాల్గొన్నారు. ఈసీ ఆదేశాల మేరకు నడచుకుంటామని ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆల స్పష్టం చేశారు.