విద్యార్థులే దేశానికి ఆశాకిరణాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం భద్రగిరికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీచైర్మన్, కలెక్టర్, ఎస్పీ అపూర్వ స్వాగతం పలికారు. తొలుత ఆమె భద్రాద్రి ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేసి సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు రాష్ట్రపతిని పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం రూ.41.38 కోట్లతో చేపట్టనున్న ‘ప్రసాద్’ పథకాన్ని ప్రారంభించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. భద్రాచలం పట్టణం వీరభద్ర ఫంక్షన్హాల్లో సమ్మక్క- సారలమ్మ పూజారుల సమ్మేళనానికి హాజరయ్యారు. ఆసిఫాబాద్, మహబూబాబాద్లో ప్రభుత్వం నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడడం హర్షణీయమన్నారు. తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ వంటి జాతరతో సమాజంలో విలువలు పెంపొందుతాయన్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ భద్రాచలం/ సారపాక, డిసెంబర్ 28
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 28 (నమస్తేతెలంగాణ)/భద్రాచలం : విద్యార్థులే దేశానికి ఆశాకిరణాలు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం పట్టణం వీరభద్ర ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. తొలుత వర్చువల్ విధానంలో ఆసిఫాబాద్, మహబూబాబాద్లో ప్రభుత్వం నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను తెలంగాణలో మొదటిసారి పర్యటిస్తున్నానన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దేశ సంక్షేమం కోసం ప్రార్థించే అవకాశం లభించిందన్నారు. ఆలయాల్లో కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ‘ప్రసాద్’ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆలయాల జీర్ణోద్ధరణ, అభివృద్ధికి పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణ వనవాసీ పరిషత్ గిరిజన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడడం హర్షణీయమన్నారు. తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ వంటి జాతరతో సమాజంలో విలువలు పెంపొందుతాయన్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్స్ ద్వారా ఆదివాసీ పిల్లలకు మెరుగైన విద్య అందుతున్నదన్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఆదివాసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆదివాసీల అభ్యున్నతికి కట్టుబడి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్లో రూ.25 కోట్లతో సేవాలాల్ బంజారా భవన్, కుమ్రుం భీం ఆదివాసీ భవన్ నిర్మించారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 23 ఏకలవ్య పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. కేవలం ఆడపిల్లల కోసమే 33 గురుకులాలను నడిపిస్తున్నామన్నారు. ఇవి కాకుండా మరో 332 ఆశ్రమ పాఠశాలలు, 24 మినీ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టామన్నారు. గురుకులాల్లో చదివిన సుమారు 1,200 మంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య, ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు పొందారన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా విదేశాల్లో విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేంపదకు రూ.20 లక్షలు సాయం చేస్తున్నామన్నారు. గిరిజన గూడేల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3,146 తండాలను గుర్తించి, వాటిని పంచాయతీలుగా మార్చిందన్నారు. గిరిజనులనే పాలకులను చేసిందన్నారు.
భద్రాద్రి జిల్లా వంటి ఏజెన్సీ జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిందన్నారు. గిర్భిణుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్యలక్ష్మి పథకం అమలు చేస్తున్నదన్నారు. బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నదన్నారు. తాజాగా న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ ప్రారంభించామన్నారు. నర్సంపేటలోని అశోక్నగర్ సైనిక్ స్కూల్లో గిరిజన విద్యార్థులకు సైనిక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. సిరిసిల్లలో ఫైన్ ఆర్ట్స్ గురుకులం ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం పలురకాల కోర్సులు పవేశపెట్టామన్నారు. ఎస్టీ యువతీ యువకులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం ద్వారా భారీగా రాయితీలు అందిస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్రపతి తన పర్యటన ముగించుకుని తిరిగి సారపాక ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకున్నారు. 2 గంటలకు హెలికాఫ్టర్లో ములుగు జిల్లాకు పయనమయ్యారు.
పర్యటన విజయవంతం
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎస్పీ వినీత్ నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఎక్సైజ్తో పాటు అన్నిశాఖల అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పర్యటన విజయవంతం చేసేలా కృషి చేశారు. అధికారులకు కలెక్టర్, ఎస్పీ అభినందనలు తెలిపారు.
పర్యటన సంతోషాన్నిచ్చింది: ఎంపీ కవిత
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకడం సంతోషాన్నిచ్చిందని మానుకోట ఎంపీ మాలోత్ కవిత తెలిపారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధిగా దేశ మొదటి పౌరురాలితో కలిసి భద్రాద్రి, రామప్ప ఆలయాలను సందర్శించడం గొప్ప అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు.
‘ప్రసాద్’ పథకం ప్రారంభం..
భద్రాలచలం/సారపాక, డిసెంబర్ 28: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాట్ల మధ్య హెలికాఫ్టర్లో సారపాక బీపీఎల్ స్కూల్ హెలీప్యాడ్లో దిగారు. ఆమెకు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి తొలుత కాన్వాయ్ ద్వారా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకున్నారు.
ఆమెకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య స్వాగతం పలికారు. మేళతాళాల నడుమ ఆలయ అధికారులు, అర్చకులు రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్రపతి ఆలయంలోని ధ్వజ స్తంభం వద్ద పూజలు చేశారు. ప్రధానార్చకులు ఆమెకు ఆలయ విశిష్టతను వివరించారు.
అనంతరం కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నిధులు రూ.41.38 కోట్లతో చేపట్టనున్న ‘ప్రసాద్’ పథకాన్ని ప్రారంభించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీఐజీ నాగిరెడ్డి, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ జీ వినీత్ గంగన్న, భద్రాచలం ఏఎస్పీ రోహిత్రాజ్, రాష్ట్ర ఎండోమెంట్శాఖ కమిషనర్ అనిల్కుమార్, భద్రాచల దేవస్థాన ఈవో బానోత్ శివాజీ, ప్రధానార్చకుడు అమరవాది విజయరాఘవన్, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, రామస్వరూప్, మురళీకృష్ణమాచార్యులు, శ్రీమాన్ పాల్గొన్నారు.
రాష్ట్రపతి నోట దాశరథి కవిత..
తొలుత రాష్ట్రపతి కల్యాణ మండపం ఎదుట గిరిజనుల నిర్వహించిన రేలాటను వీక్షించారు. కళాకారులతో కలిసి ఆడి పాడారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించిన తర్వాత ‘నమస్కారం’ అంటూ తెలుగులో మాట్లాడి ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజలను ఉత్సాహ పరిచారు. ప్రఖ్యాత కవి రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే కవితా పంక్తులను పలికారు. తెలుగంటే తనకు ఇష్టమని చెప్పారు.
కట్టుదిట్టంగా పోలీసు భద్రత…
రాష్ట్రపతిని చూసేందుకు భద్రాచలం పట్టణవాసులు ఉత్సాహం చూపారు. పర్యటన నేపథ్యంలో పోలీస్శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పకడ్బందీగా 144 సెక్షన్ను అమలు చేసింది. భద్రాచలం ఏఎస్పీ రోహిత్రాజు, మణుగూరు డీఎస్పీ రాఘవేందర్రావు, పాల్వంచ సీఐ నాగరాజు, ఎస్సై సంతోశ్ బందోబస్తును పర్యవేక్షించారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో సారపాక, భద్రాచలంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, పెట్రోల్బంకులు, సినిమాహాల్స్ మూసి ఉన్నాయి. సారపాక ప్రధాన రహదారి, ఐటీసీ రహదారితో పాటు అన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. బూర్గంపహాడ్ నుంచి భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోయాయి. తిరిగి సాయంత్రం రాకపోకలు ప్రారంభమయ్యాయి.