బోనకల్లు, ఫిబ్రవరి 23 : పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. శుక్రవారం గోవిందాపురం-ఎల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన తరగతి గదులను పరిశీలిస్తూ.. విద్యాబోధన గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా డిజిటల్ బో ర్డుపై విద్యార్థులకు బోధించారు. ఈ సందర్భంగా కమల్రాజు మాట్లాడుతూ కేజీ టు పీజీ విద్యను అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అనేక విద్యా ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అ మలు చేసిందన్నారు.
ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకా లు, దుస్తులు, కావాల్సిన సౌకర్యాలను కల్పించిన ఘనత కూడా గత కేసీఆర్ ప్రభుత్వానిదే దక్కిందన్నారు. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలన్నారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయుల కొరత ఉన్నదని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన వెంటనే డీఈవోకు ఫోన్ చేసి పోస్టును భర్తీ చేయాలని ఆదేశించారు. వెంటనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.