ఖమ్మం ఎడ్యుకేషన్, మే 1: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం బడి తెరిచిన రోజే ఉచిత పాఠ్యపుస్తకాలు అందించేందుకు అవసరమైన చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. 2023-24 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఒకింత ముందుగానే ఆలోచన చేస్తోంది. సమైక్య పాలనలో విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినా.. అరకొర పుస్తకాలే విద్యార్థులకు అందేవి. స్వరాష్ట్రంలో అందుకు భిన్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కేసీఆర్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తోంది. మే రెండో వారం నాటికి జిల్లాకు అవసరమైన పుస్తకాలు పూర్తి స్థాయిలో రానున్నాయి.
7.4 లక్షల పుస్తకాలకు ప్రతిపాదనలు..
జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్లు, కస్తూర్బా, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ గురుకులాలు, మోడల్ స్కూళ్ల వంటి పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 1.6 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఏటా ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. మొత్తం 120 టైటిల్స్ పుస్తకాలు అవసరం కాగా 30 టైటిల్స్ పుస్తకాలు జిల్లాకు చేరాయి.
2023-24 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని అన్ని పాఠశాలలకు గాను 7,41,700 పుస్తకాలు జిల్లాకు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు. విద్యార్థులకు సంబంధించిన డైస్ లెక్కల ఆధారంగా పుస్తకాలు జిల్లాకు కేటాయించనున్నారు. కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేసేలా అంచనాలు రూపొందించి ఆ దిశగా ప్రతిపాదనలు పంపారు. మొదటి విడతగా 2,26,909 పుస్తకాలు జిల్లా గోడౌన్కు చేరాయి. ఈ దఫా పుస్తకాల కొరత లేకుండా ముందస్తుగా లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా పుస్తకాలను రవాణా చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ వద్ద పుస్తకాలను అప్లోడ్ చేయడం నుంచి జిల్లాలోని విద్యాశాఖ ప్రభుత్వ గోడౌన్లో దించే వరకు పూర్తి రక్షణగా ఆర్టీసీ కార్గో సేవలు అందిస్తోంది.
9వ తరగతికీ బై లింగ్వల్..
గతంలో పాఠ్యపుస్తకాలను ఒకే మీడియంలో ప్రింట్ చేసేవారు. ప్రస్తుతం పుస్తకాలను ఒక వైపు తెలుగు మీడియంలో, మరో వైపు ఇంగ్లిష్ మీడియంలో వచ్చేలా బైలింగ్వెల్గా ప్రింట్ చేస్తున్నారు. నిరుటి దాకా 8వ తరగతి విద్యార్థుల వరకు బైలింగ్వెల్ పుస్తకాలను పంపిణీ చేసేవారు. ఈ విద్యాసంవత్సరం 9వ తరగతి విద్యార్థులకు సైతం బైలింగ్వెల్ పుస్తకాలను అమలు చేయనున్నారు. పిల్లలు తమకు అర్థం కాని విషయాలను తెలుగు, ఆంగ్ల భాషల్లో చదువుకోనున్నారు. ప్రతి పాఠాన్ని రెండు వైపులా తెలుగు, ఇంగ్లిష్లో ముద్రించడంతో విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పాఠ్యాంశాలకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుంటున్నారు.
పది రోజుల్లో మొత్తం వస్తాయి..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను జిల్లా గోడౌన్లో భద్రవపరుస్తున్నాం. మరో పది రోజుల్లో పూర్తి స్థాయిలో పుస్తకాలు జిల్లాకు చేరుతాయి. ఆ తర్వాత వాటిని మండల కేంద్రాలకు, అక్కడ నుంచి ఇండెంట్ ఆధారంగా పాఠశాలలకు పంపిణీ చేస్తాం. కొత్త విద్యా సంవత్సరంలో బడి తెరిచిన రోజే విద్యార్థులు పుస్తకాలు అందించేందుకు సన్నద్ధంగా ఉన్నాం.
-సోమశేఖరశర్మ, డీఈవో, ఖమ్మం