గతంలో కిడ్నీ బాధితులు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకునేవారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన బాధితులు డయాలసిస్ సేవల కోసం అప్పులు చేస్తూ ఆర్థిక భారాన్ని మోసేవారు. ఇక అప్పు కూడా పుట్టని పరిస్థితుల్లో ప్రాణాలు వదులుకునేవారు. ఇలాంటి ఇబ్బందులను గమనించిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 ప్రభుత్వ ఆసుపత్రులకు డయాలసిస్ కేంద్రాలను కేటాయించారు. దీనిలో భాగంగా మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో త్వరలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితులకు డయాలసిస్ సేవలు అందుతుండగా.. ఇప్పుడు ఆ కేంద్రాల సంఖ్య ఐదుకు చేరుకోనున్నది.
సారపాక, మే 17: ఒక్కసారి మనిషి కిడ్నీలు ఫెయిల్ అయితే బాధితులు జీవితకాలం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. తీవ్రతను బట్టి వారానికి ఒకసారి, రెండు సార్లు లేదా మూడుసార్లు రక్తాన్ని శుద్ధి చేయాల్సిందే. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. గతంలో కిడ్నీ బాధితులు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకునేవారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన బాధితులు డయాలసిస్ సేవల కోసం అప్పులు చేస్తూ ఆర్థిక భారాన్ని మోసేవారు. ఇక అప్పు కూడా పుట్టని పరిస్థితుల్లో ప్రాణాలు వదులుకునేవారు. ఇలాంటి ఇబ్బందులను గమనించిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 ప్రభుత్వ ఆసుపత్రులో డయాలసిస్ కేంద్రాలను కేటాయించారు. దీనిలో భాగంగా మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ నెలాఖరులోపు డయాలసిస్ కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితులకు డయాలసిస్ సేవలు అందుతుండగా ఇప్పుడు కేంద్రాల సంఖ్య ఐదుకు చేరుకోనున్నది.
కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఆసరా పథకం ద్వారా నెల నెలా ఒక్కో బాధితుడికి రూ.2,016 చొప్పున పింఛన్ అందిస్తున్నది. వైద్యులు సూచించిన సమయంలో డయాలసిస్ కేంద్రాలకు చేరుకునేందుకు బస్పాస్లు అందించింది. భద్రాచలంలోని ప్రభుత్వాసుపత్రిలో పది డయాలసిస్ యంత్రాలు, కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఐదు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలాఖరులోపు పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియానాయక్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించనున్నారు.
గతంలో కిడ్నీ బాధితులు డయాలసిస్ సేవల కోసం వ్యయప్రయాసలకోర్చి కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేవారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి డయాలసిస్ కేంద్రాలకు వెళ్లాలంటే బాధితులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ప్రతి నియోజకర్గ కేంద్రంలో డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి వస్తుండడంతో జిల్లావ్యాప్తంగా సుమారు 300మంది బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు దూరాభారం తగ్గుతుందంటున్నారు.
కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వారికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందించేందుకు ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వాసుపత్రుల్లో బాధితులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి. త్వరలో మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేటలోనూ కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. మణుగూరు కేంద్రంతో ఆళ్లపల్లి, గుండాల, కరకగూడెం, పినపాక, అశ్వాపురం మండలాలకు చెందిన కిడ్నీ బాధితులకు ఎంతో మేలు జరుగనున్నది.
– ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
కిడ్నీ బాధితులు గతంలో దూరప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చేది. మణుగూరులో డయాలసిస్ కేంద్రం ప్రారంభమైతే ఈ ప్రాంతానికి చెందిన బాధితులకు ఎంతో మేలు జరుగుతుంది. కేంద్రంలో అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. సుశిక్షతులైన టెక్నీషియన్లు బాధితులకు డయాలసిస్ చేయనున్నారు. నాణ్యమైన సేవలు అందిస్తారు.
– రాంప్రసాద్, మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్
నేను నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నా. మణుగూరులో గతంలో యూనిట్ లేకపోవడంతో భద్రాచలం వెళ్లి రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. అంతదూరం వెళ్లాలంటే వ్యయ ప్రయాసలకు గురవుతున్నా. సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా మా బాధలు ఆలకించి మణుగూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనుండటంతో నాకు భద్రాచలం వెళ్లే బాధలు తప్పాయి. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– పి.నర్సింహారావు, కిడ్నీ బాధితుడు, మణుగూరు
గత నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నా. మణుగూరు నుంచి భద్రాచలం డయాలసిస్ కేంద్రానికి రోజు విడిచి రోజు వెళ్లి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మా ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మణుగూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరం. డయాలసిస్కు వెళ్లేందుకు ప్రభుత్వం ఉచిత బస్పాస్ సౌకర్యం కల్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– బి.ముత్తయ్య, కిడ్నీ బాధితుడు, మణుగూరు