మణుగూరు టౌన్, జూలై 6: రాష్ట్రంలో మావోయిస్టుల వ్యవస్థ లేకుండా మట్టుపెట్టామని, ప్రస్తుతానికి మాదక ద్రవ్యాల రవాణా, నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మణుగూరు పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని సోమవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సమాజాన్ని పూర్తిగా వినాశనం చేసే పరిస్థితులు ఉన్నాయని, వాటిని నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈగల్ ఫోర్స్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు హోంగార్డు నుంచి డీజీపీ వరకు పటిష్టమైన వ్యవస్థ ద్వారా పోరాటం సాగిస్తున్నామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు తమ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. పోలీస్స్టేషన్కు సమస్యలు చెప్పుకునేందుకు, ఫిర్యాదులు సమర్పించేందుకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.
కాగా, నిధుల కొరత సమస్యతో నిలిచిన మణుగూరు పోలీస్స్టేషన్ను ఎస్పీ రోహిత్రాజు ప్రత్యేక చొరవ, సింగరేణి సంస్థ తోడ్పాటు, ప్రజల సంపూర్ణ సహకారంతో ప్రారంభించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఐజీ చంద్రశేఖర్, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ నాగబాబు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.