కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 8: గంజాయి విక్రయం కేసులో అరెస్ట్ అయి, రిమాండ్కు వెళ్లి బెయిల్పై విడుదలైన నిందితుడు శనివారం కొత్తగూడెం రైల్వేస్టేషన్లో దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెంలోని కూలీలైన్ ఏరియాకు చెందిన రావి మన్మథరావు (38) గంజాయి విక్రయం, రవాణాకు పాల్పడుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో జనవరి 13న గంజాయి విక్రయానికి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. కేసులో రిమాండ్కు వెళ్లిన మన్మథరావు ఈ నెల 6న బెయిల్పై బయటకు వచ్చాడు. శనివారం మధ్యాహ్నం కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్ 2వ నెంబర్ ప్లాట్ఫాంపై పడుకున్నాడు. అతని వద్దకు ఓ వ్యక్తి వచ్చి వాగ్వాదానికి దిగాడు.
అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. అపరిచిత వ్యక్తి పక్కనే ఇనుప కడ్డీతో మన్మథరావు తలపై బలంగా మోది పరారయ్యాడు. ఘటనలో తీవ్రగాయాల పాలైన మన్మథరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ అబ్బయ్య, రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. మన్మథరావు మృతిపై కేసు నమోదుచేసి మృతుడు, నిందితుడికి మధ్య గతంలో ఏమైనా లావాదేవీలేమైనా జరిగాయా? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..? లేదా యాదృచ్ఛికంగా జరిగిన వాగ్వాదం హత్యకు దారి తీసిందా? అన్న కోణాల్లో విచారిస్తున్నారు. కాగా, నిందితుడు గతంలోనూ గంజాయి మత్తులో రైల్వేస్టేషన్లోనే తిరుగుతూ ఉండేవాడని, ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవాడని స్థానికులు చెప్తున్నారు. మృతుడికి భార్యతో తరచూ గొడవలవుతూ ఉండేవని, అతడి వైఖరిని భరించలేక భార్య పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై భార్యాభర్తలను కలిపేందుకు రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ప్రయత్నిస్తున్న సమయంలోనే మన్మథరావు హత్యకు గురయ్యాడు.