కరకగూడెం, జనవరి 6 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ గోదావరి శుద్ధ జలాలు అందుతున్నాయి. స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు నల్లాల ద్వారా నేరుగా ఇంటికే చేరుతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో స్వచ్ఛమైన తాగునీటి కోసం వాగులు, వంకలు, మోటర్ల వద్దకు వెళ్లి నానా ఇబ్బందులు పడేవాళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన గోదావరి శుద్ధ జలాలు సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది.
గ్రామాల్లో ఒక్కొక్కరికీ రోజుకు 100 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పం మిషన్ భగీరథ పథకం ద్వారా ఫలించింది. దీంతో పల్లెల్లో తాగునీటి సమస్యలు తలెత్తడం లేదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులు నిర్మించి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేస్తూ ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తాగునీరు అందిస్తూ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇంటికే గోదావరి జలాలు వస్తుండడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
మా గ్రామానికి సురక్షిత తాగునీరు అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గత ప్రభుత్వాల హయాంలో తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన గోదావరి జలాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ సార్కు ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు.
– తోలెం సావిత్రి, సర్పంచ్, తుమ్మలగూడెం
ప్రతి రోజూ స్వచ్ఛమైన నీరు
మా గ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం రెండుగంటల పాటు నీళ్లొస్తున్నాయి. గోదావరి జలాలు నేరుగా నల్లాల ద్వారా ఇంటికి చేరుతుండడంతో సంతోషంగా ఉంది. గతంలో తాగునీరు కోసం అనేక ఇబ్బందులు పడేవాళ్లం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది.
– కొమ్మ లక్ష్మి, అనంతారం
పల్లె ప్రజల దాహర్తి తీరింది
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ అందుతున్న గోదావరి జలాలతో ప్రజల దాహార్తి పూర్తిగా తీరింది. గతంలో తాగునీరు కోసం నానా అవస్థలు పడిన ప్రజలు.. ఇంటికి నేరుగా గోదావరి జలాలు వస్తుండడంతో సంతోషంగా ఉన్నారు. ఇటువంటి పథకం తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలుకావడం చాలా సంతోషంగా ఉంది.
– వడ్లకొండ వెంకటేశ్, కరకగూడెం