నిరుపేదల సొంతింటి కల నెరవేరే సమయం అడుగు దూరంలోనే ఉంది. ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి ‘గృహలక్ష్మి’ పథకంతో సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.3లక్షలను మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో నేరుగా వేయనున్నది. ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో పేదలు దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటినీ అధికారులు ఈ నెల 20వ తేదీలోగా పరిశీలించి 25వ తేదీ నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అయితే గృహలక్ష్మి పథకం తొలివిడతలో భాగంగా ఖమ్మం జిల్లాలో 15,000, భద్రాద్రి జిల్లాకు 12,300 మందికి లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వం శరవేగంగా ప్రక్రియను పూర్తి చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఖమ్మం, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ) : ఇండ్లు లేని నిరుపేదల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకం వెలుగులు నింపనున్నది. ఖాళీ జాగ ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి తెలంగాణ సర్కారు సువర్ణావకాశాన్ని కల్పించింది. పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం అన్నివర్గాల ప్రజలు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసున్నారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు భారీ సంఖ్యలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో అనేక మందికి ప్రయోజనం చేకూరగా, తాజాగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ద్వారా వేలాదిమంది ఇల్లు కట్టుకునే అవకాశం కలిగింది. ఖమ్మం జిల్లాలో 78,467 దరఖాస్తులు రాగా.. తొలివిడతగా 15,000 ఇళ్లను మంజూరు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86,773 దరఖాస్తులు రాగా.. 12,300 ఇండ్లను తొలివిడతగా మంజూరు చేసింది. సొంతింటి జాగ ఉండి ఇళ్లు నిర్మించుకునే వారికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం రూ.3 లక్షలు ఆర్థికసాయం అందిస్తున్నది. గురువారంతో దరఖాస్తుల గడువు ముగిసింది. ముఖ్యంగా ఇళ్ల మంజూరీలో స్థలం ఉండి ఇల్లులేని దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, గుడిసెలు, పాకలు, రేకుల ఇండ్లలో నివాసం ఉండే పేదలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ
గృహలక్ష్మి పథకం మొదటి విడతకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయంతోపాటు మండల పరిషత్, పంచాయతీ కార్యాలయాల్లో సైతం దరఖాస్తులు స్వీకరించారు. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించేందుకు తహసీల్దార్ల ఆధ్వర్యంలో గ్రామాల్లో సర్వే నిర్వహించి.. వారి వివరాల ద్వారా జాబితా సిద్ధం చేసి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారులు జాబితా రూపొందిస్తారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారుల జాబితాను ఆమోదింపజేసి తర్వాత కలెక్టర్ వారికి గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తారు. ఇంటి నిర్మాణంలో ముందు బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, లెంటల్ లెవల్లో మరో రూ.లక్ష, స్లాబ్ స్థాయిలో మరో రూ.లక్ష చొప్పున ఇలా మూడుసార్లు లబ్ధిదారుల ఖాతాలో బిల్లులను జమ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల జాబితాను ప్రాధాన్యతా క్రమంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఇప్పటికే మండల అధికారులను ఆదేశించారు.
జాగ ఉన్న వారికే పథకం
రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి గూడు కల్పిస్తున్నది. ఇంటి జాగ ఉన్న లబ్ధిదారుడికి ఈ పథకం వర్తించేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12,300 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కొత్తగూడెం నియోజకవర్గానికి 3,000, ఇల్లెందు నియోజకవర్గానికి 1,000, భద్రాచలం నియోజకవర్గానికి 1,500, పినపాక నియోజకవర్గానికి 3,000, అశ్వారావుపేట నియోజకవర్గానికి 3,000, వైరాలో జూలూరుపాడు మండలానికి 500 ఇండ్లను మంజూరు చేసింది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం నియోజకవర్గం నుంచి 11,150, పాలేరు 13,712, సత్తుపల్లి 19,192, మధిర 16,138, వైరా 16,295, ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలోని కామేపల్లి మండలం నుంచి 1,979 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇవ్వడంతో జిల్లాలో పెద్దఎత్తున ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తుదారులు జత చేసిన డాక్యుమెంట్లు సరైనవా.. కాదా.. అని ప్రత్యేక బృందాలు సర్వే చేయనున్నారు. 20వ తేదీ వరకు విచారణ పూర్తిచేసి 25వ తేదీన లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షలను విడతల వారీగా ప్రభుత్వం జమ చేయనున్నది. జెట్ స్పీడ్తో ఈ ప్రక్రియ పూర్తికానుండగా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.