కరకగూడెం, నవంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ప్రతి గ్రామంలో అర్హులకు విడతల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరవుతున్నాయి. కరకగూడెం మండలంలో మొదటి విడతలో రికార్డు స్థాయిలో ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన ప్రభుత్వం రెండో విడతకు సిద్ధమైంది. ఇప్పటికే పలు గ్రామాల్లో 150 డబుల్ బెడ్రూం ఇండ్లను శరవేగంగా నిర్మిస్తున్నది. పలుచోట్ల ఇండ్ల నిర్మాణాలు పూర్తి దశకు చేరుకున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుపేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇండ్లను ప్రభుత్వమే నిర్మిస్తున్నది.
నిరుపేదలకు గౌరవం దక్కేవిధంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కరకగూడెం మండలం పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇన్నాళ్లు పూరిగుడిసెల్లో నివసించిన ప్రజలు ఇప్పుడు ఆత్మగౌరవంతో డబుల్ బెడ్రూం ఇండ్లలో చేరనున్నారు. కన్నాయిగూడెం గ్రామంలో 25 ఇండ్లు, బంగారుగూడెంలో 20, కౌలురులో 30, రేగళ్లలో 30, చొప్పాల పంచాయతీలో 40 ఇండ్లు మొత్తం 150 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి నాటికి అన్ని ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని పర్యవేక్షణ అధికారి ఐటీడీఏ ఏఈ ప్రసాద్ తెలిపారు. అధికారులు ఇండ్ల నిర్మాణాలను నిత్యం తనిఖీ చేస్తూ నాణ్యతా ప్రమాణాలతో పనులను వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ విడతల వారీగా ఇండ్లను నిర్మించి ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదోడి సొంతింటి కల టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వంలో సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా.. మాకు సొంతింటి కల నెరవేరలేదు. సీఎం కేసీఆర్ సార్ సకల హంగులతో మాకు రూపాయి ఖర్చు తగలకుండా ఇండ్లు నిర్మిస్తున్నారు. సార్ను జీవితాంతం మరిచిపోలేం. మా గ్రామంలో 25 ఇండ్లు పూర్తి కావచ్చాయి. అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇంట్లోకి చేరబోతుండడంతో సంతోషంగా ఉంది.
– పోలేబోయిన రామయ్య, కన్నాయిగూడెం
మా గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. అధికారులు నిత్యం గ్రామంలోకి వచ్చి నిర్మాణాలు నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సొంతింటి కల నెరవేరుతుండడంతో చాలా ఆనందంగా ఉంది. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఊకే అనసూయ, కన్నాయిగూడెం
మండల వ్యాప్తంగా 150 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు రెండో విడతలో భాగంగా శరవేగంగా జరుగుతున్నాయి. లబ్ధిదారులకు అనువుగా నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. అర్హులందరికీ విడతల వారీగా ఇండ్లను ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. మార్చి నాటికి లబ్ధిదారులకు రెండో విడత ఇండ్లు అందజేస్తాం.
– ఐవీఎన్ ప్రసాద్, ఐటీడీఏ ఏఈ