– ఆటోనగర్ టు మద్దులపల్లి రోడ్డు బాధితులకు కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి భరోసా
ఖమ్మం రూరల్, మే 22 : రోడ్డు నిర్మాణంలో ఇండ్లు నష్టపోతున్న బాధితులకు మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తప్పకుండా న్యాయం చేస్తామని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 30వ వార్డులోని ఆటోనగర్ టూ మద్దులపల్లి రోడ్డు ఏర్పాటు పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆటోనగర్ కాలనీలో రోడ్డు విస్తరణ కారణంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులు తమకు న్యాయం చేయాలని కమిషనర్ను వేడుకున్నారు.
వారి సమస్యలను విన్న కమిషనర్ స్పందిస్తూ.. ప్రజలు రోడ్డు నిర్మాణానికి సహకరించాలని, బాధితులకు తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆటోనగర్ ప్రారంభం నుండి ఇండ్ల వరకు 40 అడుగులు రోడ్డు నిర్మితమయ్యేలా మంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ప్రహరీ గోడలు మాత్రమే పోయే అవకాశం ఉంటుందన్నారు. అందుకు పూర్తి సహకారం కావాలని, అలాగే బాధితులు ఓ మెమరండాన్ని సమర్పించాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.