చింతకాని, ఏప్రిల్ 7: దళితబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని, వదంతులు, అపోహలను నమ్మవద్దని, అర్హులందరూ దళితబంధును సద్వినియోగించుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. మండలంలో లచ్చగూడెం ఎస్సీకాలనీలో గురువారం ముమ్మరంగా పర్యటించిన ఆయన.. దళితుల స్థ్ధితిగతులను పరిశీలించి వారికి కావాల్సిన యూనిట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇదే గ్రామంలో దళిత కుటుంబాల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్రామంలో 156 దళిత కుటుంబాల వారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించామని, వారిలో 68 మందికి ఇప్పటికే రూ.1.50 లక్షలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మిగిలిన వారు మోటారు యూనిట్లకు దరఖాస్తు చేసుకొన్నారని, వారికి త్వరలోనే నగదు జమ చేస్తామని తెలిపారు.
ఈ పథకం ద్వారా దళితులంతా శ్రీమంతులు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. సర్పంచ్ గురజాల ఝాన్సీ, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పీటీ కిశోర్, ఉప సర్పంచ్ మేకపోతుల సైదేశ్వరరావు, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కస్తాల సత్యనారాయణ, ప్రత్యేకాధికారి శ్యాంప్రసాద్, తహసీల్దార్ మంగీలాల్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మల్లెల రవీంద్రకుమార్, సొసైటీ డైరెక్టర్ తాతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.