ఖమ్మం :ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణీలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి అన్నారు. సోమవారం తన కార్యాలయం మీటింగ్ హాల్లో ఆశా నోడల్ పర్సన్స్కు మాతా శిశు సంరక్షణ, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీహెచ్సీలలో గర్భిణీ స్త్రీల నమోదు చాలా తక్కువగా ఉంటున్నదని పేర్కొన్నారు. ఇక నుంచి సదరు సంఖ్య గణనీయంగా పెరగాలని, వారి వివరాలను కేసీఆర్ కిట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు.
గర్భిణీలకు టీటీ ఇంజక్షన్స్, ఐరన్, క్యాల్సియం మాత్రలను అందిస్తూ, నాలుగు దఫాలు వైద్యుల దగ్గర చెకప్ జరిగేలా చూడాలన్నారు. ఆహార నియమాలను సరిచేస్తూ, ఐరన్ తక్కువగా ఉన్నవారికి సుక్రో ఇంజక్షన్స్ ఇస్తూ అనేమియా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రసవాలకు పక్కా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కాన్పులు జరుపాలని, హైరిస్క్ ఉన్నవారిని మాత్రమే రిఫరల్ ఆసుపత్రికి పంపించాలన్నారు. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ 99 శాతం, రెండవ డోస్ 49 శాతం పూర్తయ్యిందని డీఎంహెచ్వో వెల్లడించారు.
అర్హులందరికీ రెండవ డోస్ ఇప్పించాలని కోరారు. నోడల్ అధికారి డాక్టర్ సైదులు మాట్లాడుతూ.. గర్భిణీల లైన్ లిస్ట్ ఆశా, ఏఎన్ఎం, సూపర్వైజర్స్ దగ్గర తప్పని సరిగా ఉండాలన్నారు. హైరిస్క్, లోరిస్క్, సాధారణ కాన్పుతోపాటు ఆపరేషన్ అవసరమున్న వారి జాబితాను రూపొందించాలని ఆమె సూచించారు.