ఖమ్మం :జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు మరో నెలరోజులపాటు పూర్తి నివారణ చర్యలతో మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యలపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 2019 ఆగస్టు కంటే ఈ ఏడాది ఆగస్టులో డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యాయని, జిల్లాలో వరుసగా భారీ వర్షాలు, వాతావరణ ప్రభావం మరో మూడు వారాల పాటు ఉంటుందని ఇదే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు ప్రతి రోజు నమోదవుతున్నాయని, దీనికి గల కారణాలను, లోపాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో ముమ్మర చర్యలను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
బహిరంగ ప్రదేశాలలో అపరిశుభ్రమైన వాతావరణంలో తినుబండాల విక్రయం, హొటళ్లు, రెస్టారెంట్లలో పరిశభ్రత నిబంధనలు పూర్తిగా పాటించేలా ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు రాబోయే నెల రోజుల పాటు డ్రైడే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని, గ్రామాలలో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరగాలని వాటర్ క్లోరినేషన్, బ్లీచింగ్, స్ప్రేయింగ్, యాంటీ లార్వా కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ప్రబుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగ నిర్ధారణ పరీక్షల కిట్స్ సరిఫడా అందుబాటులో ఉంచాలని సీజనల్ వ్యాధులకు సంబంధించిన రోగ నిర్ధారణ పరీక్షల నివేదికలు ప్రతి రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సంబంధిత వైధ్యాదికారి ధృవీకరణతో పాటు పొందాలని జిల్లా వైధ్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు. ప్రయివేటు వైద్యశాలలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, పజల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకుండా రోగ నిర్ధారణ తప్పుడు ఫలితాలు ఇచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఇలాంటి చర్యలకు పాల్పడే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ స్నేహలత మొగిలి, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్.వెంకటేశ్వర్లు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అలివేలు, డాక్టర్ కోటిరత్నం, డాక్టర్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.